తిరుప్పావై ఐదవ పాశురము కూడ ఈ వ్రతము చేయుట వల్ల కలిగే ఫలితాన్నే తెలియజేస్తూ, కృష్ణపరమాత్మ మహిమలను విశదీకరిస్తూ, గోదాదేవి మరొకసారి గోపికలందరికీ ప్రోత్సాహన కలిగించడము జరుగుతోంది.
కష్టమైన పని చెయ్యాలంటే అందరికి బద్ధకమే. తెల్లవారు ఝామునే లేచి నదిలో స్నానము చేసి, కొన్ని కఠినమైన నియమాలతో వ్రతము చేద్దామని గోదాదేవి అంటోంది కదా. మరి అలా చేయడం వల్ల మన కష్టమే కనిపిస్తుంది కాని దాని వల్ల ప్రయోజనము ఏముంటుంది అని సందేహాలు ఉంటాయి. ఆ సందేహాల్ని తీర్చడం కోసం ఆమె ఏమి చెబుతూ వాళ్ళని పురమాయిస్తోందో చూద్దాము.
తిరుప్పావై - పాశురము 05 - "మాయనై మన్నువడమదురై మైన్దనై"
మాయనై మన్ను వడమదురై మైందనై
త్తూయ పెఱునీర్ యమునై త్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్ఱుమ్ మణివిళక్కై
తాయై కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై;
తూయోమాయ్ వందు నామ్ తూమలర్ తూ విత్తొళుదు
వాయినాల్ ప్పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళై యుమ్ పుగు తరువాన్ ఇన్ఱుఅనవుమ్
తీయినిల్ తూశాగుమ్ శెప్పే లో రెమ్బావాయ్ ||
అర్థము:
మాయావి అంటే మాయలు చేసి మన హృదయములను ఆకట్టుకునేవాడు. అటువంటి ఆశ్చర్యకరములైన మాయలు కలిగినవాడు, ఉత్తర మథుర నివాసి అగు శ్రీకృష్ణ పరమాత్మ, నిర్మలము, పవిత్రము అయిన యమునా తీరమందలి గొల్ల కులమందు మనకై ఆవిర్భవించెను.
గొల్లకులమంతటికీ ఒక రత్న దీపము వంటి యశోదమ్మ గర్భమును పవిత్రము, దేదీప్యమానము గావించెను. అతను దామోదరుడు. పద్మము నాభి యందు కలవాడు. ప్రపంచమంతా తన ఉదరములో ధరించినవాడు.
అటువంటి ఆ పరమాత్మను నిదుర వదలి, ఎటువంటి సందేహములు, భ్రమలు లేకుండ మన హృదయమనే పద్మమును సమర్పించి, నోటితో కీర్తిస్తూ, మనస్సుతో ధ్యానించుదాము.
అప్పుడు మనకు ఇప్పటి వరకునూ ఉన్న, మరియు ఇకముందు రాబోయే పాపాలన్నీ కూడ మంటల్లో పడిన దూది పింజలలాగా తత్క్షణమే కాలిపోయి, మన వ్రతము నిరాటంకముగా
కొనసాగును.
కాబట్టి అందరూ లేచి రండి. భగవన్నామ కీర్తన చేసుకుంటూ వ్రతాన్ని మొదలు పెడుదాము.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి