తిరుప్పావై 15వ పాశురములో గోదాదేవి 10వ బాలికను లేపుతూ " ఏమే చిలుకా!" అని సంభోదిస్తోంది. చిలుక గుణము ఏమిటంటే గటగటా తియ్యటి పలుకులు వాగడము. ఈ బాలిక భక్తి, జ్ఞానములలో శ్రేష్ఠురాలు. మరి ఎగతాళిగా చిలుకా అని ఎందుకు సంభోదిస్తోందో చూద్దాము.
తిరుప్పావై - పాశురము 15
ఎళ్ళే ! ఇళంగిళియే ! ఇన్నం ఉరంగుదియో ?
శిల్లెన్రళై యేన్మిన్ ? నంగైమీర్ ! పోదరు కిన్ఱేన్,
వల్లె ఉన్ కట్టురైగళ్ పండె యున్ వాయఱిదుమ్!
వల్లీర్ గల్ నీంగళే, నానేతా నాయిడుక;
ఒల్లె నీ పోతాయ్ ! ఉన్నక్కెన్న వేఱుడైయై?
ఎల్లారుమ్ పోన్దారో ! పోన్దార్, పోందు ఎణ్ణిక్కొళ్;
వల్లానై కొన్రానై మాత్తారై మాత్త ళిక్క
వల్లానై , మాయనై పాడే లో రెమ్బావాయ్ ||
అర్థము :-
ఏమే ! అందాల చిలకపలుకుల చిన్నారీ ! ఇంకా పండుకునే ఉన్నావా !
గొల్లుమని నాపై అరవకండి పరిపూర్ణులైన వారా, ఆరితేరిన వారా ! నేను బయల్దేరుతున్నాను.
ఏమోయ్ ! నీ ఘనకార్యాలు, నోటి దురుసూ మాకు తెలియనివా ఏమిటి?
సరేనమ్మా ! మీరంతా గొప్పవారు. నేనే దురుసు దాన్ని, కఠినురాలిని .
అదేంటే, పోనీ నువ్వే చెప్పు. వేరు, వేరు అని విడదీస్తావు ఏమిటి? అలా ఒంటరిగా ఉంటావెందుకు, నీ ప్రత్యేకత ఏమిటీ ?
సరే. అంతా వెళ్లిపోయారా?
వెళ్లారు, అక్కడికి జేరాక లెక్కపెట్టుకుందువు గాని. పద.
కువలయం అనే బలిష్టమైన ఏనుగును, మరియు చాణూర, ముష్టికులనే మల్లులను వధించిన ఆ మహా మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తించుదాము త్వరపడు.
ఈ విధంగా ఆ పదవ బాలిక కూడ లేచి వారితో వ్రతం చేయడానికి బయలుదేరింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి