20, నవంబర్ 2025, గురువారం

ఆంజనేయ ద్వాదశ నామావళి Anjaneya dwadasha naamaavali


ఆంజనేయస్వామి పూజ చేసేటప్పుడు ఆయనను ద్వాదశ నామాలతో (అంటే 12 పేర్లతో) కీర్తిస్తూ పూజించడము పరిపాటి. 

ఆంజనేయస్వామి అంజనాదేవి కుమారుడు. తండ్రి పేరు కేసరి. చాలా కాలము వరకు పిల్లలు లేకపోవుట చేత ఇద్దరూ కలసి శివపరమాత్మను, సూర్యుని ఉపాసన చేస్తారు. శివుడు తాండవం చేస్తూంటే రజస్ఖలనము జరిగిందని, అది సముద్రములో పడితే తట్టుకోలేక సముద్రుడు (వరుణుడు) దాన్ని సూర్యుడికి అప్పగించాడనీ, అప్పుడు సూర్యుడు దాన్ని వాయుదేవునికి ఇచ్చి అంజనాదేవి గర్భములోకి జేర్చమని చెప్పాడని ప్రతీతి. ఆ విధముగా ఆంజనేయుడు పుట్టాడు. అందుచేత ఆంజనేయుడు చాలా శక్తిమంతుడు, యుక్తిమంతుడు, దైవీక గుణములు కలవాడు అయ్యాడు. 


 

ఈ ద్వాదశనామాలు అతని ఘనకార్యములను వెల్లడిస్తున్నాయి. రామాయణములో శ్రీరాముని అత్యంత ప్రియభక్తుడు, సన్నిహితుడు ఆంజనేయస్వామి. ఇద్దరూ కలవటం వల్లనే రాముడు లంకకు జేరి రావణాసురుడిని చంపగలిగెను. సీతాదేవి ఎక్కడుందో ఆంజనేయుని ద్వారానే కనుక్కోగలిగారు. మొత్తము రామాయణములో అతనిది ఒక ముఖ్య పాత్ర. అటువంటి ఆ మహాభక్తుడైన ఆ ఆంజనేయుని ఈ పన్నెండు నామాలతో ఘనముగా కీర్తించడము జరిగింది. 

ఈ ద్వాదశ నామాలను ఒక రాగములో కీర్తిస్తూ చదువుకోవాలి. 

ఆంజనేయస్వామి ద్వాదశ నామావళి  

హనూమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః 
రామేష్ఠ ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః 
ఉదధిక్రమణ శ్చైవ సీతాశోక వినాశకః 
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవశ్శ దర్పహా || (1)

ద్వాదశైతాని నామాని కపీన్ద్రశ్చ మహాత్మనః 
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః | 
తస్య మృత్యుహ్ భయంనాస్తి సర్వత్ర విజయీ భవేత్ |  
తస్య మృత్యుహ్ భయంనాస్తి సర్వత్ర విజయీ భవేత్ || (2)

బుధ్ధిర్ బలమ్ యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా 
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ ||  

శ్రీరామ జయరామ జయజయ రామ 
జయరామ జానకిరామ 
శ్రీరామ జయరామ జయజయ రామ|| 

ఓం తత్సత్ | లోకాః సమస్తా సుఖినో భవంతు || 

అర్థములు:

మొదటి శ్లోకములో ఆయన ద్వాదశ నామాలు, రెండవ శ్లోకములో ఆ నామకీర్తన చెయ్యడము వల్ల కలిగే లాభాలు, ప్రయోజనాలు చెప్పబడినవి.  

12 పేర్లు ఈ విధముగా చెప్పబడినవి:-
 
  1. హనుమా ( ఆంజనేయుని దవుడలు వజ్రాయుధముతో గాయము చెంది వంకరగా అయిపోయినవి. అందుకని హనూమన్ అన్న పేరు వచ్చింది) హను అంటే దవుడ, మాన్ అంటే వంకరపోయినవి.
  2. అంజనాదేవి కుమారుడు (సూనుః అంటే కుమారుడా అని అర్థము)
  3. వాయుపుత్రుడు 
  4. మహాబలుడు 
  5. రామునికి ప్రీతిపాత్రుడు 
  6. అర్జునుడి స్నేహితుడు (అర్జుని రథానికి కట్టిన జెండాలో తను ఉన్నాడు)
  7. పింగాక్షుడు అంటే గోధుమరంగు కన్నులవాడు 
  8. అమిత అంటే ఎల్లలు లేని, అవధులు లేని పరాక్రమ వంతుడు. 
  9. ఉదధి అంటే సముద్రము, క్రమణము అంటే దాటుట. సముద్రము దాటినవాడు. 
  10. సీతాశోకమును పోగొట్టినవాడు 
  11. లక్ష్మణుడికి ప్రాణము తీసుకొచ్చినవాడు 
  12. దశగ్రీవుడు అంటే 10 తలలు కలవాడు. అట్టి రావణాసురుని గర్వభంగము చేశాడు. 
 ఇలా పన్నెండు పేర్లలో మొత్తము రామాయణము లోని ఆంజనేయుని పాత్ర వర్ణించబడినది. అందుకని ఈ శ్లోకము చాలా శక్తివంతమైనది.

ఫలశ్రుతి 

కపీన్ద్రుని అంటే ఆంజనేయుని పన్నెండు నామాలను ఎవరైతే చదువుతారో వారికి ఈ క్రింద చెప్పబడిన విధములుగా ఫలితములు దక్కుతాయి. హనుమంతుని మహాన్ ఆత్మ అంటే గొప్పదైన, దైవీక ఆత్మ అని పేర్కొనడము జరిగింది.
  •  స్వాపకాలము అంటే రాత్రి పూట అని కానీ, తెల్లవారు ఝామునే కానీ ప్రతీ రోజూ చదివే వారికి, మరియు యాత్రలు, ప్రయాణములు చేయునప్పుడు చదివిన వారికీ కూడ మృత్యువు భయము ఉండదు. ఎల్లా వేళలా అన్ని చోట్లా విజయమే చేకూరుతుంది. 
  • హనుమంతుని స్మరణ చేసే వారికి బుద్ధి వికాసము, బలము, యశస్సు, ధైర్యము పెంపొందును. 
  • ఎటువంటి భయములు ఉండవు. రోగాలు కూడ ఉండవు. అజాడ్యము అంటే సోమరితనము ఉండదు. వాక్కు పటుత్వము పెరుగును. 
ఓం తత్ సత్ అంటే ఇది నిజము. కాబట్టి మనము ఈ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉంటే మంచి జరుగుతుంది అని నాకు కూడ నమ్మకము ఉంది.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి