ఇంట్లో పూజ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఇంట్లో పూజ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, అక్టోబర్ 2024, శుక్రవారం

శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం - Venkateswara Suprabhatam Lyrics

 


శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పారాయణము ప్రతిరోజూ తిరుపతి తిరుమల దేవస్థానం లో అతి భక్తిశ్రద్ధలతో జరుగుతూ ఉంటుంది. భక్తులందరూ ఆ సమయం కోసం ఎదురుచూస్తూ ఉండి అయన దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటూ ఆనందిస్తూంటారు. 

ఈ సుప్రభాతంలో నాలుగు భాగాలు లేదా సోపానాలు ఉన్నాయి. 

  1. వెంకటేశ్వర సుప్రభాతము లేదా మేలుకొలుపు 
  2. వెంకటేశ్వర స్తోత్రము లేదా కీర్తన 
  3. శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి లేదా శరణాగతి 
  4. మంగళాశాసనము లేదా మంగళ హారతి 
ఇవన్నీ కూడా ప్రతివాది భయంకరం అన్నంగరాచార్య అనే శ్రీ వైష్ణవ భక్తుని కృతులు. ఈయన 1361లో జన్మించారని ఎరుక. తిరుమల తిరుపతిలో సుప్రభాత సేవలు చేస్తున్నప్పుడు శ్రీ వేంకటేశ్వరునికి మంచిగా కృతులు పాడుతూ సేవ చేయడం కోసమని వీటిని స్వయంగా రచించి సేవ చేశారు. అప్పటి నుండీ ఇదే పధ్ధతి నడుస్తోంది. 

ఇప్పుడు ఈ బ్లాగులో ( బ్లాగ్ అన్న పదానికి ఏదైనా తెలుగు పదం ఉందో లేదో నాకు దొరకడం లేదు ) నేను శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం గురించి తెలియజేస్తున్నాను . ఇందులో 29 చరణాలు / శ్లోకాలు ఉన్నాయి. ప్రతి యొక్క శ్లోకము రాస్తూ దాని అర్థాన్ని కూడా తెలియ జేస్తాను. 

వెంకటేశ్వర స్వామిని భక్తులు నిద్ర లేపుతున్నారు పూజలు అందుకోవడం కోసం.  అలా నిద్ర లేపుతూ చుట్టుపక్కల ప్రకృతిలో ఏమేం జరుగుతోందో తెలుపుతూ ఆయన్ని లేపడం జరుగుతోంది.

ఇక్కడ అందరూ దయచేసి ఒక విషయం గమనించాలి. వెంకటేశ్వర స్వామిని సంభోదించేటప్పుడు ఆయన్ని రామా అని, గోవిందా అనీ, ఇంకా అనేకమైన పేర్లు వాడుతారు. అందరూ విష్ణువు యొక్క రూపాలే కనుక. 
  

శ్రీ వెంకటేశ్వర సుప్రభాతమ్


కౌసల్యా సుప్రజా రామా ,పూర్వాసంధ్యా ప్రవర్తతే 
ఉత్తిష్ఠ నరశార్దూల, కర్తవ్యమ్ దైవమాహ్నికమ్ || (1)

కౌసల్యాదేవి ముద్దులపట్టి శ్రీ రామా ! తెల్లవారే సమయం అయిపోతోంది. లేవవయ్యా ఓ సింహముతో పోలిన మానవా, నిత్య దైనందిన కర్మలు ఆచరించనీ.   


ఉత్తిష్ఠో ఉత్తిష్ఠ , గోవింద, ఉత్తిష్ఠ గరుడధ్వజ 
ఉత్తిష్ఠ కమలాకాంత, త్రైలోక్యం మంగళం కురు || (2) 

ఓ గోవిందా (రక్షించే స్వామీ)! లేవండి , లేవండి స్వామీ ! ఓ గరుడ ధ్వజము గల స్వామీ , లేవండి. ఓ లక్ష్మీ కాంతా లేవండి. కమలా అంటే కమలములో ఉద్భవించిన దేవి. అంటే లక్ష్మీదేవి తనకు సతిగా ఉన్న స్వామిని లేపుతున్నాము. ఓ స్వామీ, ముల్లోకములకూ మంగళాన్ని (మంచిని) ప్రసాదించండి. 


మాతః సమస్త జగతామ్ ! మధుకైటభారేహ్   
వక్షో విహారిణి, మనోహర దివ్యమూర్తే 
శ్రీస్వామిని, శ్రితజన ప్రియ దానశీలే 
శ్రీవేంకటేశ దయితే, తవ సుప్రభాతమ్ || (3)  

ఓ మాతా! అమ్మా పద్మావతీదేవి! సమస్త ప్రపంచానికీ తల్లీ , మధు, కైటభ దానవులకు శత్రువైన విష్ణుమూర్తి వక్షములో విహరించు లక్ష్మీ ! మనోహరమైన దివ్యమంగళ రూపుడైన మహావిష్ణువు యొక్క స్వామినీ! నిన్ను ఆశ్రయించు వారికి ప్రియమైన తల్లీ! కోరికలు తీర్చు దానగుణము కల మాతా! శ్రీ వేంకటేశ్వరుని పత్నీ! నీకు మంగళకరమైన ఉదయము గాక. 


తవ సుప్రభాత మరవింద లోచనే 
భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే 
విధి శంకరేంద్ర వనితాభి రర్చితే 
వృషశైలనాథ దయితే దయానిధే || (4)    

మీ మంగళమయ మైన ప్రాతఃకాలము ఎంతో కన్నుల విందుగా ఉంది. ఓ తల్లీ , నీ ప్రసన్న ముఖము చంద్రమండలము వలె ప్రకాశిస్తుండగా శంకరుడు, ఇంద్రుడు, దేవ వనితలు, మొదలైన వారంతా కూడ ఎంతో శ్రద్ధగా మిమ్ముల పూజిస్తున్నారు. ఓ వృషభాచల నాథుడైన వేంకటేశ్వరుని ప్రాణేశ్వరీ, దయతో నిండిన దేవీ . (నీకు వందనములు). 


అత్రియాది సప్తఋషయస్స ముపాస్య సంధ్యాం 
ఆకాశ సింధు, కమలాని మనోహరాణి,
ఆదాయ పాదయుగం అర్ఛయతుం ప్రపన్నాహ్ 
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || (5)      

అత్రి మొదలైన సప్త ఋషులంతా కూడ సంధ్య వార్చగా ఆకాశమంతా సింధు వర్ణముతో కమలములాగా ఎంతో అందంగా వెలుగుతుండగా మీ పాద పద్మములను కూడ అర్చించుట కోసం ఎంతో ఆతురతో వేచి ఉన్నారు. ఓ శేషాద్రి శిఖర ప్రభూ మీ ఉదయము మంగళమయ మగు గాక !


పంచానన ఆబ్జభవ షణ్ముఖ వాసవాద్యా 
త్రైవిక్రమాది చరితం విబుధా స్తువంతి 
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్ 
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || (6)   

ఐదు ముఖముల శివుడు, కమలంలో పుట్టిన బ్రహ్మ, ఆరు ముఖముల సుబ్రహ్మణ్య స్వామి, వసువులు, దేవతలు మొదలైన వారంతా త్రివిక్రముడవైన నీ చరిత్రాన్ని చక్కగా స్తోత్రము చేస్తున్నారు. బృహస్పతి వారఫలాలు, తిథులు, మంచి చెడు ఘడియల పఠనము చేయుచున్నాడు.  ఓ శేషాద్రి శిఖర ప్రభూ మీ ఉదయము మంగళమయ మగు గాక !


ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ 
పూగద్రుమాది సుమనోహర పాలికానాం 
ఆయాతి మందమనిలః సహ దివ్యగంధైహి 
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || (7)

కొద్దిగా విచ్చుకున్న కలువ పూలు, కొబ్బరి పూలు, మరియు పారిజాతము, వక్కల పొదల నుండి వీచే పిల్ల గాలులు సువాసనలను వెదజల్లుతున్నాయి. ఓ శేషాద్రి శిఖర ప్రభూ మీ ఉదయము మంగళమయ మగు గాక !


ఉన్మీల్య నేత్రయుగ ముత్తమ పంజరస్థాహ్
పాత్రావశిష్ఠ కదళీఫల పాయసాని 
భుక్త్వా సలీల మథాకేళి శుకా పఠంతి
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || (8)

పరవశముతో నిండిన అర్థనిమీలిత కన్నులతో ఉత్తమమైన పంజరాలలో ఉన్న ఉత్తమ పాత్రలలో ఉన్న అరటిపళ్ళు, పాయసము తనివి తీరా ఆరగిస్తూ ఆడుతూ, పాడుతూ చిలుకలు ఎంతగానో  ఆనందిస్తున్నవి.  ఓ శేషాద్రి శిఖర ప్రభూ మీ ఉదయము మంగళమయ మగు గాక !


తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా 
గాయత్యనంత చరితమ్ తవ నారదోపి 
భాషా సమగ్ర మసకృత్ కర చారు రమ్యమ్ 
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || (9)

వీణల తీగలను తియ్యగా మీటుతూ నారదుడు మొదలైన వారు మీ యొక్క అంతులేని చరిత్రలనే పాడుతున్నారు ఎంతో విశిష్టమైన భాషా శైలిలో అద్భుతంగా పొల్లుపోకుండా ! ఓ శేషాద్రి శిఖర ప్రభూ మీ ఉదయము మంగళమయ మగు గాక !


భృంగావళీ చ మకరంద రసానువిద్ధ 
ఝమ్కార గీత నినదై సహసేవనాయ 
నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యహ 
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || (10)

తుమ్మెదలు, తేనెటీగలు మకరందము (తేనె) తాగుతూ పెద్దగా చప్పుళ్ళు చేస్తూ కలువపూల పుప్పొడిలోంచి పైకి ఎగురుతూ మీ సేవ కోసమై పాడుతున్నట్లుగా నినాదాలు చేస్తున్నాయి. ఓ శేషాద్రి శిఖర ప్రభూ మీ ఉదయము మంగళమయ మగు గాక !


యోషా గణేన వరదధ్ని  విమధ్య మానౌ 
ఘోషాలయేషు దధి మంధన తీవ్ర ఘోషా 
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాహ్ 
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || (11)

చుట్టుపక్కల గొల్లవారంతా తమ కుండల్లోకి పాలు పితుకుతుంటే ఆ పితుకుతున్న పాలు, కుండలూ కూడా పెద్దగా చప్పుళ్ళు చేస్తూంటే పక్కనే ఉన్న (అర్జున) చెట్లపైని ఉన్న కుంభ పక్షులన్నీ కూడా రెక్కలు విదిలిస్తూ కోపంతో గట్టిగా అరుస్తున్నాయి.  ఓ శేషాద్రి శిఖర ప్రభూ మీ ఉదయము మంగళమయ మగు గాక !


పద్మేశ మిత్ర శతపత్ర గతాళివర్గాహః  
హర్తుమ్ శ్రియం కువలయస్య నిజాఙ్గ లక్ష్మ్యాహ 
భేరీ నినాద మివ బిభ్రతి తీవ్ర నాదం 
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || (12)

పద్మముల మిత్రుడైన సూర్యుని జ్యోతిలో ప్రకాశిస్తున్న ఆ పద్మాల కంటే ఆకర్షణీయంగా ఉండాలని ఆ పువ్వులలో నుండి ఎగిరే తుమ్మెదలు గట్టిగా గోల చేస్తున్నాయి. అంతేకాక లక్ష్మీదేవి ఇరుపక్కలా ఉన్న ఏనుగులు కూడా భేరీ నినాదాలు చేస్తున్నాయి. ఓ శేషాద్రి శిఖర ప్రభూ, మీ ఉదయము మంగళకర మగు గాక ! 


శ్రీమన్ అభీష్ట వరదా ఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో 
శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్య మూర్తే 
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (13) 

శ్రీమాన్ ! కోరిన వరాలొసగే సమస్త లోకాలకూ బంధువా ! ఓ శ్రీనివాస (లక్ష్మికి నివాసమా), జగత్తులో ఒక్కగానొక్క దయా సాగరుడివి నీవు . లక్ష్మీదేవి కొలువున్న విశాల వక్షముతో అందమైన భుజములు గల దివ్య మంగళ మూర్తివి నీవు. ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.  


శ్రీ స్వామి పుష్కరిణి కా ప్లవ నిర్మలాంగా 
శ్రేయోర్థినో హర విరించి సనందనాద్యా 
ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగా 
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (14)

మీ పుష్కరిణి లోని పవిత్రమైన జలములతో తమ శ్రేయస్సుని కోరుకుంటూ స్నానమాచరించి శివుడు, బ్రహ్మ, సనక సనందాద్యులు మీ ద్వారము వద్ద ఉత్సుకతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము. 


శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి 
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం 
ఆఖ్యామ్ త్వదీయ వసతే రనిశం వదంతి 
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (15)

శేషశైలము, గరుడాచలము, వెంకటాద్రి పర్వతము, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి, మొదలైన ఏడు కొండలూ కూడ నీ యొక్క ముఖ్యమైన నివాస స్థానములని చెప్పుకుంటున్నారు అందరూ అన్ని వేళలా కూడ . ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.   


సేవాపరా శివసురేశ కృశాను ధర్మ 
రక్షో అంబునాథ పవమాన ధనాధినాథాహ్ 
భద్దాంజలి ప్రవిలస న్నిజశీర్ష అదేశాహ్ 
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (16)

నీ సేవ కోసమై శివుడు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, యముడు, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, మొదలైన వారంతా తమ తలలపై చేతులు జోడించుకుని నీ ఆజ్ఞల కోసం వేచి ఉన్నారు. ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము. 


ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ 
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాహ్ 
స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే 
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (17)

మీ వాహనములైన పక్షిరాజు గరుత్మంతుడు, మృగరాజైన సింహము, సర్ప రాజైన ఆది శేషువు, గజరాజైన ఐరావతము, అశ్వ రాజైన ఏడుతలల తెల్లని ఉచ్చైశ్రవము, మొదలగునవి మీ సేవ ఇంకా బాగా చేయగలిగే శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాయి. ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.   


సూర్యేన్డు భౌమ బుధ వాక్పతి కావ్యసౌరి 
స్వర్ భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా 
త్వద్దాస దాస పరమావధి దాసదాసాహ్ 
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (18)

సూర్యుడు, చంద్రుడు, (భౌమ) మంగళుడు, బుధుడు, బృహస్పతి, కావ్య కుమారుడైన శుక్రుడు, (సౌరి) శని, స్వరభాను (రాహువు), కేతువు మొదలైన నవగ్రహ దేవతలంతా నీ దాసులకంటే దాసులకు కూడా సేవ చేస్తామంటూ ఎదురుచూస్తున్నారు. ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.   


త్వత్పాద ధూళి భరిత స్ఫూరితోత్తమాంగా 
స్వర్గాపవర్గ నిరపే క్ష్య నిజాంతరంగాహ్ 
కల్పాగమా కలనయా ఆకులతాం లభంతే 
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (19)

వారంతా కూడ నీ పాదధూళితో పవిత్రమైన ఉత్తమ శరీరులై స్వర్గము, స్వర్గము కానిది అనే భేదము చూడక తమ హృదయాంతరంగంలో ఈ కల్పము ముగిసే సమయంలో జరిగేదాన్ని ఊహించుకుని దుఃఖితులై సతమతమవుతున్నారు. ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము. 


త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణా 
స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంతః 
మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే 
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (20)

మీ గోపురాగ్రము మీద ఎక్కి ఎదురుచూస్తూ స్వర్గాన్ని, మోక్షాన్ని కూడ వదిలేసి మానవలోకంలోని మనుష్యులంతా మీ ఆశ్రయమే కోరి మీకే సేవ చేస్తామంటూ మీ కోసమే ఎదురు చూస్తున్నారు. ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము. 


శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే 
దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే 
శ్రీమన్ అనంత గరుడాదిభి రర్చితాంఘ్రే
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (21)

శ్రీ భూదేవి కి నాయకా ! దయ మొదలైన అమృత గుణముల సాగరా, ఓ దేవుళ్లకే దేవుడా , జగత్తుకి ఒక్కగానొక్క శరణమైన దైవమా ! అనంతనాగు సర్పము, గరుత్మంతుడు, మొదలైన వారిచే అర్చింపబడే దేవా ! ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.  


శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ 
వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే 
శ్రీవత్సచిహ్న శరణాగత పారిజాత 
శ్రీ వెంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (22) 

ఓ పద్మమునే నాభిగా పొందిన పురుషోత్తమా ! వసుదేవుని పుత్రుడు, మరియు వసువులందరికీ దేవుడవైన వాసుదేవా ! వైకుంఠ (కుంఠములు లేదా ఆందోళనలు లేని ప్రదేశం) వాసా, మా (లక్ష్మీ) ధవుడా, జనుల వ్యాకులత, సమస్యలు పోగొట్టే దేవా , ఓ చక్రాన్ని ధరించిన, శ్రీవత్స చిహ్నము కల స్వామీ, శరణాగతులకు పారిజాత పుష్పము లాంటి అదృష్టమా !  ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.  


కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే 
కాంతా కుచాంబురుహ కుట్మలలోల దృష్టే 
కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే 
శ్రీ వెంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (23)

కందర్పుని (మన్మథుని) గర్వము అణచిన సుందరమైన దివ్యాకృతి కల స్వామీ ! కాంతలందరు (స్త్రీలు) నీ వక్షోజముల వైపు శృంగార మరియు అసూయా భరితమైన దృష్టితో చూసే సౌందర్యము కల స్వామీ ! కళ్యాణము, నిర్మలము లైన గుణములతో దివ్యంగా కీర్తించబడే స్వామీ ! ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము. 


మీనాకృతే, కమఠ, కోల, నృసింహ వర్ణిన్ 
స్వామిన్, పరశ్వథ తపోధన, రామచంద్ర,
శేషాంశ రామ, యదునందన, కల్కి రూప 
శ్రీ వెంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (24)

మీనాకృతి అంటే మత్స్యావతారం, (కమఠ) కూర్మ లేదా తాబేలు అవతారం, (కోల) వరాహ అవతారం, నృసింహావతారము, (స్వామి) వామన , (పరశ్వథ తపోధన ) పరశురామ , రామ, శేషాంచ రామ అంటే బలరాముడు, కృష్ణుడు, కల్కి ఇన్ని అవతారాలు దాల్చే  ఓ వెంకటాచల ప్రభువా ! నీకు సుప్రభాతము.   


ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం 
దివ్యం వియత్సరితి హేమ ఘటేషు పూర్ణమ్ 
ధృత్వాద్య వైదిక శిఖామణయహ్ ప్రహృష్టా
తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్ || (25)

ఏలకులు, లవంగాలు, కర్పూరము మొదలగు సుగంధాలు ఆకాశగంగ జలాలలో బాగా కలిపిన నీటితో నింపిన బంగారు బిందెలతో వేదాలలో ఆరితేరిన పండితులు మీకోసం కూర్చుని ఎదురు చూస్తున్నారు. ఓ వేంకట స్వామీ మీ ఉదయము మంగళమయ మగు గాక !


భాస్వానుదేతి వికచాని సరోరుహాణి 
సంపూరయంతి నినదై కకుభో విహంగాహ్ 
శ్రీవైష్ణవా సతత మర్చిత మంగళాస్తే 
ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్ || (26)

సూర్యుడు ఉదయిస్తున్నాడు. సరోరుహములు (కమలములు, పద్మములు) విప్పారుతున్నాయి. కకుభ వృక్షాల పైని (అర్జున చెట్టు) పక్షులు గట్టిగా అరుస్తున్నాయి. శ్రీవైష్ణవులు ఎల్లప్పుడూ మంగళము (అంతా మంచి జరగాలని ) కోరుకుంటూ మీ సన్నిధి కోసం వేచి ఉన్నారు. ఓ వెంకటేశా మీ ఉదయము మంగళమయ మగు గాక !


బ్రహ్మాదయ సురవరా స్స మహర్షయస్తే 
సంత స్సనందన ముఖాస్తథ యోగివర్యాహ్ 
ధామాంతికే తవహి మంగళ వస్తుహస్తా 
శ్రీ వెంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (27)

బ్రహ్మ మొదలగు దేవతలందరూ, మహర్షులు, సంతులైన సనక సనందాదులూ మొదలగు ప్రముఖులైన యోగులంతా కూడ తమ చేతులలో మంగళకరమైన వస్తువులు (బహుమతులు) పట్టుకుని ఉన్నారు. ఓ వేంకటాచల ప్రభువా, మీ ఉదయము మంగళమయమగు గాక !  


లక్ష్మీనివాస, నిరవద్య గుణైక సింధో 
సంసార సాగర సముత్తరణైక సేతో 
వేదాంత వేద్య నిజవైభవ భక్తభోగ్య 
శ్రీ వెంకటాచల పతే తవ సుప్రభాతమ్ || (28)

ఓ లక్ష్మీదేవికి  నివాసమా! మచ్చలేని గొప్ప గుణాల పెన్నిధీ ! ఈ సంసార సాగరాన్ని ఈదడానికి నీవే వంతెనలాంటి వాడివి.  నీయొక్క మహిమలు వేదాలనెరిగిన పండితులకే సాధ్యము. మా వంటి భక్తులందరికీ నువ్వు అనుభవించ తగవైన వాడివి. ఓ వేంకటాచల పతీ ని ఉదయము మంగళమయ మగు గాక !   


ఇత్థం వృషాచలపతే రివ సుప్రభాతమ్ 
యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాహ్ 
తేషామ్ ప్రభాతసమయే స్మ్రుతి రంగభాజాం 
ప్రజ్ఞామ్ పరార్థ సులభామ్  పరమాం ప్రసూతే || (29) 

ఇది వృషాచలపతి (శ్రీ వెంకటేశ్వర స్వామి) యొక్క సుప్రభాత గీతము .  ఎవరైతే దీనిని ప్రతిరోజూ చిత్తశుద్ధితో చదువుతూ, పారాయణ చేస్తుంటారో, లేదా ప్రొద్దుటే జ్ఞాపకం చేసుకోవడము, రాగములతో పాడుకోవడము, భజించడము చేస్తారో వారంతా కూడ ప్రజ్ఞావంతులౌతారు, మోక్షాన్ని పొందుతారు. 

మిగతా భాగాలు చదవడానికి ఈ క్రింది లింకులపై క్లిక్ చేయగలరు. 



శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనం    
      


20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

విష్ణు పూజ స్తోత్రములు - Vishnu Pooja Hymns

 


మనం ఇంట్లో ప్రతి రోజూ పూజ చేసుకునేటప్పుడు కాస్త క్లుప్తంగా చేసుకుంటాము మన వీలుని బట్టి. అటువంటప్పుడు ఒకటి, రెండు వినాయకుని శ్లోకాలు, లక్ష్మీదేవి శ్లోకాలు, విష్ణు శ్లోకాలు, అలాగే శివపార్వతి స్తుతి, శ్రీ రాముని స్తుతి, శ్రీ కృష్ణ స్తుతి మన వీలుని బట్టి, పద్ధతులని బట్టి చదువుకుని దేవునికి ఆరగింపు పెట్టేస్తే చాలు. 

నేను ఇలాగే చేస్తుంటాను రోజూ. ముందుగా తల్లితండ్రులని, గురువులు/ఆచార్యులని స్మరించి, శుక్లాంబర ధరమ్ చదువుకుని , కేశవనామాలు చదువుతాను. 

ఆ తర్వాత ఈ క్రింద ఇవ్వబడిన మూడు విష్ణు స్తోత్రాలు చదువుతాను.

విష్ణు స్తోత్రములు 

శాంతాకారం, భుజగ శయనం, పద్మనాభం, సురేశం 
విశ్వాకారం, గగన సదృశమ్, మేఘవర్ణం, శుభాంగమ్ 
లక్ష్మీ కాంతం, కమల నయనం, యోగి హృద్యానగమ్యం 
వందే విష్ణుం, భవ భయ హరమ్, సర్వలోకైక నాథమ్ || (1)

తాత్పర్యము :-

మూర్తీభవించిన ప్రశాంతత తో శేషు సర్పము పై పవ్వళించిన పద్మనాభా (పద్మమునే నాభిగా కల విష్ణు మూర్తి ) ! దేవతల అధిపతి , సమస్త విశ్వమూ తన ఆకారంగా కలిగి, ఆకాశము పోలిక కలిగి, మేఘముల రంగు, అందమైన శుభప్రదమైన శరీరముతో, లక్ష్మీదేవితో కూడి, కమలముల వంటి కన్నులు కలిగి, యోగుల హృదయానికి కూడ అంతు చిక్కనటువంటి (అర్థము కానటువంటి) ఓ సమస్త లోకములకు ఏకైక ఏలికవై ఉండి అందరి భయములను తొలగిస్తూ ఉండే విష్ణుమూర్తీ ! మీకివే నా వందనములు. 


మేఘ శ్యామం, పీత కౌసేయ వాసం,
శ్రీ వత్సాంకం, కౌస్తుభోద్భాసితాంగం,
పుణ్యోపేతం, పుండరీకాయతాక్షం,
విష్ణుం వందే సర్వ లోకైక నాథం ॥ (2)

తాత్పర్యము :-

మేఘము వంటి చిక్కటి రంగు కలిగి, బంగారు పట్టుపంచె,కండువా దాల్చి, శ్రీవత్స చిహ్నము కలిగి, కౌస్తుభ మణి ప్రకాశం వెదజల్లుతూ, పవిత్రతో ఉట్టిపడుతూ, పుండరీకముల వంటి కనులు కలిగి ఉండెడి ఓ అన్ని లోకాలకూ ఏకైక నాథుడవైన విష్ణు మూర్తీ, నీకు వందనములు.


స శంఖః చక్రం, స కిరీట కుండలం,
స పీతవస్త్రం, సరసీ రుహేక్షణం,
సహార వక్షస్థల శోభి కౌస్తుభం,
నమామి విష్ణుం, శిరసా చతుర్భుజమ్ || (3)

తాత్పర్యము :-

శంఖము, చక్రము, కిరీటము, కుండలములు, పట్టు వస్త్రములు దాల్చి, తామర పువ్వులవంటి కనులు కలిగి, హారముతో కూడిన వక్షస్థలం కౌస్తుభమణి తో శోభించు చుండెడి ఓ విష్ణుమూర్తీ, నాలుగు భజములు కలిగిన నీకు నా శిరస్సు వంచి నమస్కరించు చున్నాను. 

ఈ స్తోత్రాలు చదివి మీరు పూజ ముగించేసుకోవచ్చును. ధూపం, దీపం, చూపించి నైవేద్యం పెట్టేసుకోవచ్చును. 

ఇంకా సమయం ఉన్నవాళ్లు శ్రీ రామ కీర్తన, శ్రీ కృష్ణ స్తుతి, శివపార్వతుల స్తుతి  తృప్తిగా చేసుకుని అప్పుడు నైవేద్యం పెట్టుకోవచ్చును.  మీ సౌకర్యాన్ని బట్టి చేసుకోండి. నేను ఇవన్నీ చదివి, హనుమాన్ చాలీసా కూడా చదువుతుంటాను ప్రతిరోజూ. ఇవన్నీ చదివితే కాని నాకు తృప్తిగా ఉండదు మరి. కానీ సమయం ఉన్నవాళ్లే ఇలాంటివన్నీ పెట్టుకోవాలి. మనస్సు వేరే వైపు పెట్టుకుని చేసుకోకుండా.         
  
  

4, ఏప్రిల్ 2020, శనివారం

గురు స్తుతి - ఆచార్య వందనము శ్లోకములు - వైష్ణవ సంప్రదాయం పద్దతిలో

ప్రతి రోజూ చేసుకునే పూజ మరియు విశిష్ట పూజలు ప్రారంభము మొదలెట్టే ముందు మనం ఈ ఆచార్య పరంపర మరియు గురువుల పూజతో మొదలు పెట్టాలి. 

మన తల్లి తండ్రులు, భగవంతుడు కూడా మనకు ఆచార్యులే అవుతారు. వీరందరిని తలుచుకుని స్తుతించి అటు పిమ్మట పూజని మొదలు పెట్టాలి. వీరు మనకు జన్మనిచ్చిన వారు, మనకు విద్య మరియు శాస్త్ర జ్ఞానమును ప్రసాదించి మనని ప్రాయోజకులనుగా తీర్చి దిద్దినవారు. అందుకని ప్రతిదినము వీరిని ధ్యానించి మన కృతజ్ఞతలను తెలుపుకొనుట మన కర్తవ్యము. అలా చేస్తే దేవునికి కూడా అత్యంత ప్రియంగా ఉంటుంది. 



వైష్ణవ సంప్రదాయం పద్దతిలో పూజ చేసే వారందరూ వారి గురువులు,  మరియు ఆచార్యులతో బాటు ఆళ్వార్లను (దేవుని పరమ భక్తులను) కూడా ముందుగా స్మరిస్తూ వారందరికీ నమస్కారములు సమర్పించి ఆ పిమ్మట పూజ మొదలు పెట్టడం ఆనవాయితీ.

మన ప్రస్తుత ఆచార్యులు, గురువుల నుండి మొదలు పెట్టి వారి పై తరముల వారిని కూడా మనకు తెలిసినంతవరకూ స్మరించి పూజించుకోవాలి. ఈ విధముగా పూజించుటకై మన పూర్వీకులు ఈ క్రింది శ్లోకములను (వైష్ణవ తనియలను) సృష్టించారు.

గురుస్తుతి -ఆచార్య వందనము 


శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్
యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్ || (1)

లక్ష్మీనాథ సమారంభామ్ నాథయామున మధ్యమామ్
అస్మదాచార్య పర్యన్తామ్  వందే గురుపరంపరామ్ || (2)

యోనిత్య మచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే |
అస్మద్గురో: భగవతోస్య దయైక సింధో:
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే || (3)

మాతాపితా యువత యస్తనయా విభూతి:
సర్వమ్ యదేవ నియమేన మదన్వయానాం |
ఆద్యస్య న: కులపతే: వకుళాభి రామం
శ్రీమత్తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా: || (4)

భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ |
భక్తంఘ్రిరేణు పరకాల యతింద్రమిశ్రాన్
శ్రీమత్పరాంకుశ మునిం  ప్రణతోస్మి నిత్యమ్ || (5)

పై శ్లోకములకు అర్థములు:

1) మొదటి శ్లోకము:
ఈ శ్లోకము లో మనవాళ మాముని కి నమస్కరించడం జరిగింది. ఆయన ఒక గొప్ప భక్తుడు మరియు ముని కూడ.
రామానుజాచార్యులు వైష్ణవ మత ఉద్ధారము మరియు ప్రచారము చేయుచు ప్రజలకు వెలుగు మార్గము చూపించే కార్యక్రమాలలో నిష్టగా పనిచేయుచు 120 ఏళ్ళకి శరీరము త్యజించగా ఆ కార్యక్రమాన్ని ఇంకా ముందుకి సాగించుటకై మనవాళ మాముని అవతరించెను. ఈయన తన భక్తి జ్ఞాన రసములతో అనేక ఉపదేశములు చేయుచు భగవంతుని సేవలో మనస్ఫూర్తిగా విలీనమై ఉంటుండెను.
ఈయన భక్తి నిష్ఠలకు స్వయంగా శ్రీ రంగనాథస్వామి మిక్కిలి సంతోషించి తబ్బిబ్బు అయిపోయెను.
స్వయంగా ఆ రంగనాథ స్వామియే ఈ శ్లోకము రాసి ఉండవచ్చునని ఆయన భక్తులు మరియు శిష్యుల నమ్మకము.

శ్లోకార్థము:
శ్రీ శైలేశ దయాపాత్రుడు (ఇక్కడ శ్రీ శైలేశుడు ఆయన గురువు మరియు శ్రీశైలేశ నివాసి అయిన తిరువాయిమొళి పిళ్ళై). శ్రీశైలేశుడు అంటే మన దైవమైన శ్రీ రంగనాథ స్వామి కూడా.

అందుచేత ఇక్కడ అర్థము ఏమిటంటే మనవాళ మాముని తన గురువైన తిరువాయిమొళి పిళ్ళై కు అల్లాగే శ్రీ రంగనాథ స్వామికి కూడా దయాపాత్రుడు.  మఱియును జ్ఞానము భక్తి విషయములలో మిక్కిలి దిట్ట. అంతే కాదు. ఆయన యతీన్ద్రులైన శ్రీ రామానుజాచార్యులకు కూడ అతి సన్నిహితుడు. అట్టి రమ్యజామాతృ ముని కి నేను నమస్కరించుచున్నాను.

మనవాళ మాముని కి ఇంకో పేరు రమ్యజామాతృ ముని అని కూడా ఉంది.
ఇక్కడ ఈ శ్లోకాన్ని రాసినది భగవంతుడే కనుక ఆయనే నమస్కారము చేసినట్లుగా మనము అనుకోవచ్చును.

అంటే ఈ విధంగా ఆ దేవుడే మనవాళ మాముని యొక్క గొప్పతనము మనకు తెలియచేసినట్లుగా మనము అనుకోవచ్చును. అందుకే ఈ శ్లోకాన్ని మనము ముందుగా చదివి ఆ మునికి మన దాసోహములు అర్పించుకుంటున్నాము.


2) రెండవ శ్లోకము:
వైష్ణవ ఆచార్యులు మరియు భక్తుల నమ్మకము ప్రకారము మన మొదటి గురువు స్వయంగా ఆ పరంధాముడైన శ్రీమన్నారాయణ స్వామియే. ఆయన మొదటిగా గురుమంత్రమును (అంటే తిరుమంత్రము) శ్రీ బదరీనారాయణ స్వామికి ఆ తరువాత విష్ణు రూపంలో శ్రీ మహాలక్ష్మికి  ఉపదేశించారు. కాబట్టి మనము ఆయనతో మొదలు పెట్టి మధ్యలోనున్న పలువురు గురువులతో బాటుగా మన ప్రస్తుత గురువు వరకు అందరికీ నమస్సులు అర్పించుకోవాలి.

శ్లోకార్థము:

లక్ష్మీనాథులైన ఆ పరంధామునితో మొదలిడి, మధ్యలో ఉన్న నాథముని మఱియును యామునాచార్యుల క్రమము వరకూ, ఇంకా ఆ తరువాతి గురువులందరితో పాటుగా ప్రతి ఒక్కరికీ, దాసోహములు సమర్పించుతూ, నా ప్రస్తుత ఆచార్యులకు కూడ నేను నమస్కరించు చున్నాను. 

3) మూడవ శ్లోకము:
ఈ శ్లోకంలో మన శ్రీవైష్ణవ పునాదికర్త మఱియును ఆచార్యులును అయిన శ్రీ రామానుజాచార్య మహాపురుషునికి ప్రణామములు సమర్పిస్తున్నాము. 
(ఆ మహావిష్ణువు శయ్య అయిన ఆదిశేషువే వైష్ణవ మత పునరుద్ధరణ కోసము రామానుజాచార్యులుగా అవతరించెనని చెప్పుకుంటారు).

శ్లోకార్థము:

ఏ మహాపురుషుడైతే స్వయంగా ఆ పరంధాముని పాదపద్మములనే తన ప్రీతి భాగ్యముగా మఱియును సంపద గాను భావించి తక్కిన వాటినన్నిటినీ తృణప్రాయముగా విసర్జించెనో, ఎవరైతే తన మనస్సు అంతయు దయతో నిండిన సముద్రము వంటివారో, అట్టి నా పరమ పూజ్య గురువైన శ్రీ రామానుజాచార్యులు వారి పాదములను ఆశ్రయించి శరణు కోరుచున్నాను.

4) నాలుగవ శ్లోకము:
నాల్గవ శ్లోకములో నమ్మాళ్వార్ ధ్యానము చేయబడుతోంది.
నమ్మాళ్వార్ గారు భగవంతునికి అతి సన్నిహితుడు మరియు ప్రీతిపాత్రుడైన 12 మంది ఆళ్వార్లలో ప్రముఖ స్థానము పొందినవారు. కలియుగ ప్రారంభములో ఈయన అవతరించి 32 ఏళ్ళు భగవంతుని సేవ చేసి ఆయన సాన్నిధ్యము చెందెను.

ఆచార్య పరంపరలో మొదటి స్థానము భగవంతుడిది. పిమ్మట లక్ష్మి దేవి, బదరీనారాయణుడు/విక్ష్వక్షేనుడు, ఆ తరువాతి స్థానము ఈ నమ్మాళ్వార్ గారిదే.

శ్లోకార్థము:

ఎవరి పాదములైతే పొగడపూవు వాసనలు విరజల్లుచు తల్లి తండ్రుల ప్రేమలు అందించునో, ఏ పాదములైతే ఈ ప్రాపంచిక బంధములు మరియు పాపకర్మలతో కూడిన సముద్రము నుండి (ఏ విధముగా అయితే ఒక సుపుత్రుడు తన తల్లి తండ్రుల కర్మలు చేసి వారికీ మోక్షము చేరే అవకాశము కల్పిస్తాడో) విముక్తిని ప్రసాదించి మోక్షమనే ఒడ్డుకు చేర్చేందుకై తహ తహ లాడుచుండునో, ఏ పాదములైతే మనకు మరియు మన రాబోవు సంతానములకు కూడ సుస్థిరమైన సుఖ శాంతులను ప్రసాదించునో అట్టి పాదయుగ్మములకు నేను శిరసా ప్రణామములు సమర్పించుకుంటున్నాను.

5) ఐదవ శ్లోకము:
అయిదవ శ్లోకంలో వైష్ణవ మతాన్ని తమ భక్తి, ప్రేమ రసములతో వ్యాపింపజేసిన 12 మంది వైష్ణవ ఆళ్వార్ లనూ వారి జన్మ కాలానుగుణంగా పేర్కొని వారికి దాసోహములు సమర్పించడం జరుగుతోంది.

శ్లోకార్థము:

ఈ శ్లోకం ద్వారా 12 మంది ఆళ్వార్ల పేర్లు చెప్పుతూ వారికి, మరియు శ్రీ రామానుజాచార్యుల వారికీ కూడ  ప్రతిదినము నమస్సులు అర్పించెదమని వేడుకుంటున్నాము.

భూతం = భూత యోగి (పూదత్త ఆళ్వార్)
సరశ్చ = సరో యోగి (పొయిగై ఆళ్వార్)
మహదాహ్వయ = మహా యోగి (పేయాళ్వార్)
భట్టనాథ = భట్టనాథులు (పెరియాళ్వార్ అనగా విష్ణుచిత్తులు)
శ్రీ = గోదాదేవి (ఆండాళ్)
భక్తిసార = తిరుమళిశైయాళ్వార్
కులశేఖర = కులశేఖరాళ్వార్
యోగివాహాన్ = తిరుప్పాణాళ్వార్ (మునివాహన)
భక్తఅంఘ్రిరేను = తొండరప్పొడియాళ్వార్ (విప్రనారాయణ)
పరకాల = తిరుమంగైయాళ్వార్ (పరకాల ముని, కలివైరి)
యతీన్ద్ర = రామానుజాచార్యులు (ఈయన ఆళ్వార్ కాదు. మన మొదటి గురువు)
మిశ్రాన్ = మిశ్ర కవి లేదా మధురకవి ఆళ్వార్
పరాంకుశ ముని = నమ్మాళ్వార్  (శఠకోపన్)

ఈ పై వారందరినీ కూడా వరుస క్రమములో ధ్యానిస్తూ నిత్యమూ ప్రతి రోజూ కూడా నమస్సులు చెప్పుకుంటూ మనము పూజ మొదలెట్టుకోవాలి. ఇది ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయం లోనిది. 

 

17, నవంబర్ 2018, శనివారం

Daily Puja - ఇంట్లో పూజ ప్రతిరోజూ ఏ విధముగా చేసుకోవాలి

మన ఇళ్లల్లో ప్రతిరోజు పూజ చేసుకోవడం అనేది సాధారణముగా  మనము మన పెద్దల దగ్గిర నుండి నేర్చుకుంటూ ఉంటాము. కాకపొతే మన పెద్దలు ఉన్నప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి మన పరిస్థితులు వేరు. 

ప్రస్తుత పరిస్థితులలో మనకి సమయం చాలా వ్యస్తంగా ఉండి పూజకి ఏ విధముగా సమయం కేటాయించుకోవాలో అర్ధం కాకుండా  సతమతమవుతూ  ఉంటు న్నాము. అటువంటి వారు అతి కొద్దీ సమయంలో తృప్తిగా ఎలా పూజ చేసుకోవాలి అన్నది  ఇక్కడ వివరించి చెప్పడానికి ప్రయత్నము చేస్తాను.   

నేను చెప్పే ఈ విధానాన్ని మీరు ఎలా కావాలనుకుంటే అల్లాగే మీకు అనుగుణముగా మార్చుకోవచ్చును. మీకు ఉన్న సమయము, సదుపాయాలని బట్టి, నేను విశదీకరించే సలహాలని బట్టి మీరు మీ విధానాన్ని రూపొందించుకో వచ్చును.

 
పూజ చేసే సందర్భంలో దేవునికి కేవలం పూజ కాకుండా ఇంకా కొన్నిసేవలవంటివి ముందూ, వెనకా  ఉంటాయి. ఎలాగైతే మనకి కొన్ని ముఖ్యమైన కాల్యకృత్యాలు, కలాపాలు ఉంటాయో అల్లాగే దేవునిచేత కూడ చేయిస్తాము. ఉదాహరణకి చేతులు, కాళ్ళు కడుక్కోవడం, స్నానం చెయ్యడం, ఇలాంటివి. 

ఇవి మీకు కుదిరితేనే చెయ్యాలి. తప్పనిసరి కాదు. నాకు ఇలాంటివి కొన్ని చెయ్యడము ఆనందముగా, తృప్తిగా ఉండటము వలన మీకు కూడ చెబుతున్నాను. 

పూజకు ముందు చేసే ఏర్పాటులు 

  1. ముందుగా మనము స్నానము చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుందాము. పట్టు బట్టలు ఉంటే అవి విడిగా పెట్టుకుని రోజూ కట్టుకుని పూజ చెయ్యవచ్చును. నెలకొకసారి అవి డ్రై క్లినింగు చేయించుకోవచ్చును. 
  2. ఎలాగైతే మనం ఇల్లు శుభ్రము చేసుకుంటామో అదేవిధముగా భగవంతుని ఉంచే స్థలం శుభ్రం చేసుకోవాలి. తడి బట్టతో తుడిచి కూడ శుభ్రం చేసుకోవచ్చును. విగ్రహము, దేవుని   పటాలు కూడ అప్పుడప్పుడు శుభ్రము చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన దేవుడు కళకళ లాడుతూ నవ్వుతూ ఉంటాడు. 
  3. దీపం కుందులు వారానికి ఒకసారి సబ్బుతో తోముకుంటే మంచిది. తక్కిన రోజుల్లో పాత వత్తులు తీసేసి, క్రొత్త వత్తులు పెట్టి దీపం వెలిగించుకోవాలి. 
  4. అలాగే పూజ చేసే పాత్రలు కూడా కడుక్కోవాలి. ఇవి ప్రతీ రోజు శుభ్రంగా నీళ్లతో కడిగేసుకుంటే చాలు. 
  5. Vim suddham అని ఒక లిక్విడ్ వస్తోంది ఈ మధ్య. దానితో అయినా, లేదా చింతపండుతో నైనా అప్పుడప్పుడు కడిగితే కుందులు, పాత్రలు మెరుస్తూ ఉంటాయి. మనస్సుకి హాయిగా ఉంటుంది అవి చూస్తే. ఎంత ఇంపుగా ఉంటాయో తెలుసా! అలా వాటికేసి తనివి తీరా చూస్తూ ఉండాలని ఉంటుంది.   
  6. దేవుడిని ఏదైనా మందిరము లాంటి దాన్లో పెట్టవచ్చును లేదా ఒక పీట మీద అయినా పెట్టవచ్చును. సాధారణముగా తూర్పు లేదా ఉత్తరము దిక్కులో పెట్టాలి. కుదరకపోతే ఎలాగైనా పెట్టుకుంటాము. 



పూజకు కావాల్సిన సామగ్రి 

  1. దేవుని విగ్రహాలు, బొమ్మలు వగైరా. 
  2. పూజకి చదివే స్తోత్రాలు, పుస్తకాలు, క్యాసెట్లు లాంటివి. 
  3. దీపం కుందులు (రెండు పెడితే మంచిది). 
  4. దీపం నూనె మరియు వత్తులు. 
  5. అగరవత్తులు, వాటికి స్టాండ్. అల్లాగే కర్పూరము - అది వెలిగించేందుకు ప్లేట్ కానీ స్పూన్ లాంటిది కానీ.
  6. ఒక పళ్ళెము మరియు చిన్నరాగి చెంబు కానీ స్టీల్ అయినా ఫర్వాలేదు. ఒక ఉద్ధరిణె (స్పూన్ లాంటిది). రెండు గిన్నెలు ఉంటే ఇంకా మంచిది. ఒకటి దేవునికి, ఇంకోటి మనం ఆచమనం వగైరా చేసుకోడానికి ఉంటాయి.  
  7. నైవేద్యం (పళ్ళు, కొబ్బరికాయ, పటికబెల్లం, పంచదార, బెల్లం, ఇటువంటి వాటిలో ఏవైనా పెట్టవచ్చును. అన్నం కానీ లేదా మరేదైనా వంటకం అప్పుడప్పుడైనా, లేదా రోజు వండి పెడితే అది మరి మంచిది.)
  8. పువ్వులతో పూజ చేస్తే పువ్వులు మరియు ఎప్పుడైనా కుంకుమ పసుపులతో పూజ చేస్తే అవి కూడా రెడీగా ఉంచుకోవాలి. 

పూజావిధానము 

  • కుందులలో వత్తులు పెట్టి, దీపం నూనె పోసి వెలిగించాలి. 
  • చెంబులో మంచి నీరు పట్టుకుని పళ్ళెము, చెంబు, ఉద్ధరిణెతో సహా దేవుని దగ్గర పెట్టుకోవాలి. రెండు గిన్నెలు ఉంటే రెండింట్లో నీళ్లు పెట్టుకోవచ్చును. 
  • దేవునికి కుడివైపు కూర్చుని పూజ చేయాలి. కుదరని పక్షంలో ఎదురుగానైనా కూర్చుని చేయవచ్చును. 
  • ముందుగా చెంబు లేదా పాత్ర లోని నీటిని ఉద్ధరిణితో తీసుకుని దేవునికి స్నానం చేయిస్తున్నట్లుగా చుట్టూ తిప్పి పళ్లెంలో పొయ్యాలి. అల్లా రెండు, మూడు సార్లు అయ్యాక మళ్ళీ కాసిని నీళ్లు తీసుకుని మూడు సార్లు ఆచమనం చేయించినట్లుగా దేవునికి చూపించి పళ్లెంలో వదలాలి. 
  • ఆ తరువాత శుక్లామ్బరధరం శ్లోకము చదివి, గురుస్తుతి చేసి నెత్తి మీద నీటి చుక్కలు బొటన వేలితో మూడు సార్లు జల్లుకుని, మూడు సార్లు అచ్యుతాయ నమః అనే మూడు నామాలు చదువుకుంటూ ఆచమనం చేసి పూజ మొదలు పెట్టాలి. ఆచమనం మనకోసం పెట్టుకున్న పాత్రలోంచి నీళ్లు తీసుకుని చెయ్యాలి.  
  • పూజలో మీరు ఏ శ్లోకాలు కావాలంటే అవి చదువుకుని అష్టోత్తరములు కూడా కావాలంటే చదువుకుని పూజ చేసుకోవచ్చును. నామాలు చదివేటప్పుడు పువ్వులు వేస్తూ కూడ పూజ చేసుకోవచ్చును. లేదా వట్టినే చదివేసుకోవచ్చును. 
  • ఇవన్నీ అయ్యాక దణ్ణం పెట్టుకుని లేచి నిలబడి అగరవత్తులు వెలిగించి దేవుళ్ళకి చుట్టూ తిప్పి వాసన చూపించి స్టాండ్ లో పెట్టాలి. 
  • అల్లాగే దీపాన్ని కుడి చేతితో దేవునికి చూపించాలి. 
  • ఆ పిమ్మట నైవేద్యం మీద కాసిని నీటి చుక్కలు వేసి దేవునికి ఆరగింపు పెట్టాలి. అంటే కుడి చేత్తో ఆ నైవేద్య పదార్థాన్ని దేవునికి చూపిస్తూ స్వాహా స్వాహా అని తినిపించినట్లుగా. 
  • నైవేద్యం అయ్యాక చేతులు మూతి కడిగినట్లుగా కాసిని నీళ్లు చూపించి పళ్లెంలో వదలాలి. అల్లాగే కాళ్ళకి చూపించి మళ్ళీ పళ్లెంలో వదలండి. మళ్ళీ కాస్త మంచి నీళ్లు తాగించినట్లుగా దేవునికి చూపించి పళ్లెంలో వదలాలి. 
  • ఇప్పుడు కర్పూరం వెలిగించి మంగళ హారతి చదవాలి. 
  • హారతి అయ్యాక కాసిని నీళ్లు కర్పూరం చుట్టూ త్రిప్పి పళ్లెంలో వదలండి. హారతిని కళ్ళకి అద్దుకోవాలి. 
  • అటు పిమ్మట ఆ పళ్ళెంలోని నీళ్ళని దేవుని పాత్రలోని నీళ్లలో కలిపేసి అదే తీర్థముగా తీసుకోవాలి. నైవేద్యం కూడా కళ్ళకి అద్దుకుని గ్రహించాలి. 

ఇది శాస్త్రోక్తం ప్రకారం సులభంగా చేసుకునే మార్గం. ఇదంతా చేయడానికి 10, 15 నిమిషాలు కంటె ఎక్కువ పట్టదు. దీన్ని ఇంకా మీకు కావాల్సిన విధంగా కూడ మార్చుకోవచ్చును. సమయం ఉంటే అరగంట, ఇంకా ఎక్కువ సేపు కూడా చెయ్యవచ్చును.