17, జనవరి 2026, శనివారం

సంకటనాశక గణేశ స్తోత్రము - Sankat Naashak Ganesh Stotram - సంకష్టహర చతుర్థి

సంకట నాశన గణేశ స్తోత్రము నారద పురాణము లోనిది. తన శాప విమోచనము కొరకై విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఈ స్తోత్రమును నారద మహాముని గాత్రము చేసి, దీని మహిమను లోకులకు తెలియజేసెను. నారద మహర్షికి విష్ణువు మరియు పార్వతి ద్వారా శాపములు కలిగెను. శాప విమోచనము కొరకై విష్ణువు ఆజ్ఞ మేరకు బహుశా (ఇప్పటి బద్రీనాథ్ లోని) అలకనందా నదిలో స్నానము చేసి ఈ సంకటనాశక గణేశ స్తోత్రము ద్వారా విఘ్నేశ్వరుని కీర్తించెను. ఇంకొక చోట కూడా నారదుడు స్నానమొనర్చినట్లు చెప్పబడినది. అది పశ్చిమ గుజరాత్ లో సరస్వతీ నది సముద్రములో కలిసే చోట ఉందని చెప్పబడే నారాయణ సరస్సు. ఈ రెండింట్లో ఎక్కడైనా నారదుడు ఈ స్తోత్రాన్ని పారాయణ చేసి ఉండవచ్చును.

మనకు సందర్భము కంటే స్తోత్రము ముఖ్యము ఇక్కడ.



ఈ సంకటనాశన స్తోత్రాన్ని ముఖ్యముగా ప్రతి మాసము కృష్ణ పక్ష చవితి అంటే సంకష్టహర చతుర్థి నాడు పారాయణము చేయుట శ్రేష్ఠమని భావిస్తారు. ఆ రోజున విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజ చేయడము, సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు ఉపవాసముండి, చంద్రోదయమైనాక విఘ్నేశ్వరుని ముఖ్యపూజ చేసి, అష్టోత్తరనామాలు, ఈ స్తోత్ర పారాయణము చేస్తారు. ఆ తరువాత నైవేద్యము సమర్పించిన పిమ్మట భోజనము చేస్తారు. 

ఇప్పుడు స్తోత్రాన్ని అర్థములతో సహా వివరిస్తున్నాను.

సంకటనాశక గణేశ స్తోత్రము 


ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ 
భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే || (1)

అర్థము:
శిరస్సు వంచి ప్రణామము చేస్తున్నాను ఓ గౌరీ పుత్రుడా, వినాయకా! సదా భక్తుల మదిలో నిలయము చేయు నిన్ను ఎల్లవేళలా స్మరిస్తూ ఉంటాను, దీర్ఘఆయుస్సు, అర్థ కామ మోక్షముల పొందుటకై.
 

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్
తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || (2)

అర్థము: 

1) మొదటిది వక్రతుండము (మెలితిరిగిన తొండము) ఉన్నవాడు. అంటే సందర్భానికి అనుగుణముగా తనను మలచు కోవడము ఎరిగినవాడు.

2) రెండవది ఒకే దంతము కలిగినవాడు. ఇది సమయస్ఫూర్థి, మరియు తెలివి సూచకము. 
(ఒక కథనం ప్రకారము వేదవ్యాసుడు మహాభారతము వినిపిస్తుండగా విఘ్నేశ్వరుడు అతి వేగముతో రాస్తున్నప్పుడు కలము విరిగిపోతే తన దంతము విరగకొట్టుకుని దాన్నే కలము/కుంచెగా అమర్చుకున్నాడు, రాయడము ఆగకుండా ఉండుటకని.)

3) మూడవది నల్లటి, ఎఱ్ఱని (బంగారు గోధుమవర్ణపు)  కన్నులు కలవాడు. ఇది తీక్ష్ణ దృష్టి, చురుకుదనమునకు ప్రతీక.

4) నాలుగవది ఏనుగు ముఖము కలవాడు. విశాల స్వభావము, బుద్ధిమత, తెలివితేటలకు ప్రతీక.  


లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ 
సప్తమం విఘ్నరాజం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || (3)

అర్థము:

5) ఐదోది లంబోదరుడు. విశ్వమంతా తనలో ఇమిడ్చుకో గలవాడు. అమిత గుణ సంపన్నుడు.
 
6) ఆరవదేమో వికటుడు. భీకరము, గంభీరమైన వాడు.

7) ఏడవది విఘ్నరాజు. విఘ్నములకు రాజు అంటే విఘ్నములను, కష్టములను, ఆపదలను పొందకుండా తన భక్తులను కాపాడుకునేవాడు. 

8) ఎనిమిది ఏమో ధూమ్రవర్ణుడు. ధూమ్రము అంటే పొగ. పొగ వంటి రంగు అనగా బూడిద వర్ణములో ఉంటాడు అని భావము. అహంకారాన్ని, పొగరుని అణచడానికి ఈ వర్ణములో నాలుగు చేతులతో అగుపిస్తూ ఏలుతూ ఉంటాడు.
 

నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకమ్ 
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || (4)

అర్థము: 

9) తొమ్మిది ఫాలచంద్రుడు. వినాయకుని ముఖము చంద్రుని వలె వెలిగిపోతూ ఉంటుంది అని ఒక అర్థము, చంద్రవంకను ధరించేవాడని ఒక అర్థము. అతని ముఖ దేదీప్యమానతను, ఉన్నతత్త్వమును సూచించే నామము ఇది.
  
10) పది అయితేనేమో వినాయకుడు. వినాయకుడు అన్నా విఘ్నములకు నాయకుడు అనే అర్థమే వస్తుంది. అంటే కాక అతనే నాయకుడు, అతనికి వేరే నాయకులెవ్వరూ లేరు అని అర్థము. ఇది అతని స్వామిత్వమును, ఉన్నతస్థాయిని సూచిస్తోంది.
 
11) పదునొకండవది గణపతి. గణపతి అనగా గణములన్నింటికీ ఇతను ప్రభువు అని. అందరినీ తన అదుపులో ఉంచుకుని భక్తులకు అండదండగా ఉంటూ కాపాడుతూ ఉంటాడు.
 
12) పన్నెండేమో గజాననుడు. ఏనుగు ముఖము కలిగిన వాడు. అంతులేని జ్ఞానముతో వెలుగొందువాడు. ధైర్యసాహసములు కలవాడు. బలముతో, యుక్తితో భక్తులను కాపాడేవాడు. 


ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః 
నచ విఘ్న భయం తస్య సర్వసిధ్ధి కారకం ప్రభో || (5)

అర్థము:

ఈ పన్నెండు నామములను ఎవరైతే ముప్పొద్దులూ చదువుతారో అట్టివారికి విఘ్నములు కాని భయములు కాని కలుగకుండు. వారికి అన్ని సిద్ధులు సమకూరును.

విద్యార్థీ లభతే విద్యాం దనార్థీ లభతే ధనం 
పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిమ్ || (6)  

అర్థము:

విద్యను ఆశించేవారికి విద్యలు, ధనము ఆశించువారికి ధన ప్రాప్తి కలుగును.
పుత్రులను ఆశించువారికి పుత్రప్రాప్తి (అంటే సంతాన ప్రాప్తి), మోక్షము కోరుకునే వారికి మోక్షము లభించును.

జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్ మాసై ఫలం లభేత్ 
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః || (7)

అర్థము:

ఆరు మాసముల పాటు కనుక ఈ స్తోత్ర పారాయణము చేసినచో అన్ని ఫలములు కలుగును. ఒక సంవత్సర పర్యంతము పఠించిన వారికి అన్ని సిద్ధులు కలుగుతాయి. ఇందులో ఏమాత్రము సందేహము వలదు.

అష్ఠభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ 
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః || (8) 

అర్థము:

ఎనిమిది మంది బ్రాహ్మణోత్తములకు ఈ స్తోత్రమును తమ చేతులతో వ్రాసి పంచిపెట్టిన యెడల వారికి సకల విద్యలతో బాటు అన్ని ఫలితములు దక్కును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి