పంచాయుధ స్తోత్రములు అనగా విష్ణువు యొక్క ముఖ్యమైన ఐదు ఆయుధములను కీర్తిస్తూ చదివే స్తోత్రములు. ఇవి చక్రము, శంఖము, గద, ఖడ్గము, మరియు ధనుర్బాణములు.
ఈ పంచాయుధ స్తోత్ర పారాయణము చేసి మనము విష్ణుమూర్తిని, మరియు ఆ ఆయుధముల ద్వారా కూడ మనకు రక్షణ కల్పించమని వేడుకోవడము జరుగుతోంది.
ఈ పంచాయుధములు మనల్ని శత్రువులు, అరిషడ్వర్గములు, మున్నగువాటి నుండి రక్షించడమే కాక మనకి అనేక విధాల లాభదాయకములు అయినవి. అందుచేత ఈ స్తోత్రముల పారాయణ ప్రతిరోజు చేయడము మంచిది.
చక్రాయుధము తేజస్సు, జ్యోతి, మరియు ఆత్మశక్తి , చేతనా శక్తి ప్రదాయిని. దీని ద్వారా ఆత్మజ్ఞానము పెరుగుతుంది.
శంఖము వాక్కును, వినికిడి శక్తిని పెంపొందింప జేస్తుంది.
గదాయుధము శరీర బలము, కండబలము, శక్తి పెంపొందుతుంది.
ఖడ్గము మరియు బాణములు/ధనుస్సు ఈ రెండు ఆయుధముల స్తోత్రము వలన మన మెదడు, దృష్టి, మనస్సు, సకల అవయవములను సంయమనం చేసుకుని, మన గమ్యము, కార్యములను సఫలము చేసుకోవడానికి తోడ్పడుతాయి.
అంటే మనము ఈ పంచాయుధ స్తోత్ర పారాయణము ద్వారా ఇవన్నీ మనకు సమర్పించమని, అంతేకాక ఎల్లవేళలా మనని కనిపెట్టుకుని కాపాడుతూ ఉండమని భగవంతుని ప్రార్ధిస్తున్నాము అనే ఒక గట్టి నమ్మకముతో ఈ స్తోత్రాలను చదువుకుంటే మంచి జరుగుతుంది అని నా నమ్మకము.
ఇప్పుడు ఈ స్తోత్రాలను వాటి అర్థములతో కూడా తెలియజేస్తున్నాను.
పంచాయుధ స్తోత్రములు
స్ఫుర త్సహస్రార శిఖాతి తీవ్రమ్
సుదర్శనం భాస్కరకోటి తుల్యమ్
సురద్విషామ్ ప్రాణ వినాశి విష్ణోహ్
చక్రం సదాహం శరణం ప్రపద్యే || ( 1 )
అర్థము :-
చురుకైన వేలకొలది (లేదా వేయి మండుతున్న భాస్వర కణములు) వలె అగ్నిశిఖల కంటే తీవ్రమైన సుదర్శన చక్రము ఏదయితే కోటి సూర్యులతో సమానమైనదో మరియు రాక్షసుల ప్రాణములను అవలీలగా హరిస్తుందో అటువంటి సుదర్శన చక్రాయుధమునే నేను శరణు వేడుతున్నాను.
విష్ణోర్ ముఖోత్థానిల పూరితస్య
యస్య ధ్వనిర్ దానవ దర్పహంతా
తం పాంచజన్యం శశికోటి శుభ్రమ్
శంఖం సదాహం శరణం ప్రపద్యే || ( 2 )
అర్థము :-
విష్ణువు ముఖమునుండి వెలువడిన వాయువు ద్వారా పూరించబడి (ఊదబడి) వెలువడిన ధ్వని దానవుల గర్వాన్ని హరించి హడలగొట్టే పాంచజన్యము కోటి చంద్రుల కాంతి కన్నా గొప్పది. అటువంటి పాంచజన్య శంఖమును నేను సర్వదా శరణు వేడుతున్నాను.
హిరణ్మయీమ్ మేరు సమాన సారామ్
కౌమోదకీమ్ దైత్యకులైక హంత్రీమ్
వైకుంఠ వామాగ్ర కరాభి మృష్టామ్
గదాం సదాహం శరణం ప్రపద్యే || ( 3 )
అర్థము :-
బంగారు మయము (పూర్తిగా బంగారముతో చేయబడినది), మేరు పర్వతము వంటిది, కౌమోదకీ అన్న పేరు కలిగినదీ, దైత్య కులాన్ని నాశనము చేయునది, వైకుంఠనాథుడు అయిన విష్ణుమూర్తికి ఎడమచేతి అలంకారము అయినటువంటి ఆ గదాయుధమును నేను సదా శరణు వేడుతున్నాను.
రక్షో సురాణామ్ కఠినోగ్ర కంఠ
చ్ఛేదక్షర చ్చోణిత దిగ్ద ధారమ్
తం నందకం నామ హరే ప్రదీప్తమ్
ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే || ( 4 )
అర్థము :-
దేవతల రక్షణము చేయు సమయమందు రాక్షసుల కఠినాతి కఠిన మైన కంఠములను కూడ చేదించి ఎడతెరిపిగా కారిపోవుతున్న రక్తపు ధారలతో తడిసిన నందకము అనే పేరు కలిగిన ఆయుధము, శ్రీహరి చెంత ఉండే ఖడ్గాన్ని నేను సర్వవేళల శరణు వేడుతున్నాను.
యజ్ఞా నినాద శ్రవణాత్ సురాణామ్
చేతాంసి నిర్ముక్త భయాని సద్యః
భవంతి దైత్యాశని బాణ వర్షి
శార్ఙ్గమ్ సదాహం శరణం ప్రపద్యే || ( 5 )
అర్థము :-
ధనుస్సు యొక్క ధ్వని విన్న వెంటనే రాక్షసులు భయముతో వణికిపోయేట్లా చేసి, జనులందరి భయములను పోగొట్టుటకై ఆ రాక్షసులందరిపై బాణవర్షము కురిపించునటువంటి ఆ శార్ఙ్గమనే ధనుస్సుని నేను శరణు వేడుతున్నాను.
ఫల శ్రుతి
ఇమమ్ హరే పంచ మహాయుధానాం
స్తవం పఠేత్ యోను దినమ్ ప్రభాతే
సమస్త దుఃఖాని భయాని సద్యః
పాపాని నశ్యంతి సుఖాని సన్తి
అర్థము :-
ఇవి అయిదును శ్రీహరి యొక్క పంచ మహాయుధములు. వీటి కీర్తన ప్రతిదినము ప్రభాత కాలములో చదివితే సకల దుఃఖములు సమసి పోయి, పాపములు నశించి, సుఖములను పొందెదరు.
వనే, రణే, శత్రు, జలాగ్ని మధ్యే
యదృచ్ఛ యాపత్సు మహా భయేషు
ఇదమ్ పఠన్ స్తోత్ర మవాకులాత్మా
సుఖీ భవేత్ తత్కృత సర్వ రక్షహ
అర్థము :-
అడవులలోను, యుద్ద భూములందును, శత్రువుల మధ్యలోను, నీటి ప్రమాదము, అగ్ని ప్రమాదము లోను, ఇంకా అనుకోకుండా వచ్చే ఆపదల సమయము లందును, భయము వేసినప్పుడల్లా భీతి చెందకుండా, చిత్తశుద్ధితో ఈ స్తోత్రాలను చదివితే మిమ్మల్ని ఇవి అన్నివేళలా రక్షిస్తూ సుఖముగా ఉంటారు.
స శంఖ చక్రమ్ స గదాసి శార్ఙ్గమ్
పీతాంబరమ్ కౌస్తుభ వత్స చిహ్నమ్
శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగమ్
విష్ణుం సదాహం శరణం ప్రపద్యే ||
అర్థము :-
శంఖ చక్రముల తోనూ, గద, ఖడ్గము, ధనుస్సుల తోనూ, పీతాంబరము, కౌస్తుభమణి, శ్రీవత్స చిహ్నముల తోనూ, లక్ష్మీదేవితోను కూడి ఉండి దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ విష్ణుమూర్తిని నేను ఎల్లవేళలా శరణు వేడుతున్నాను.
జలే రక్షతు వారాహః
స్థలే రక్షతు వామనః
ఆటవ్యామ్ నారసింహశ్చ
సర్వత పాతుహు కేశవః ||
అర్థము :-
నీటి ప్రమాదముల నుండి వరాహ స్వామి రక్షించును. భూమి పైన ప్రమాదముల నుండి వామనుడు రక్షించును. అడవిలో వచ్చే ప్రమాదముల నుండి నరసింహ స్వామి రక్షించును. అన్నిచోట్లా, అన్ని సమయములలో కలిగే ఆపదలనుండి కేశవుడు (అంటే శ్రీమన్నారాయణుడు) రక్షించును.