30, ఏప్రిల్ 2025, బుధవారం

గాయత్రీ మంత్రము అర్థములతో సహా - Gayatri Mantra Full Meanings


గాయత్రీ మంత్రము ఋగ్వేదము లోని ఒక సూక్తము (3.62. 10). 3వ మండలము, 62వ సూక్తము లోని 10వ శ్లోకము (మంత్రము) ఇది. 
    
ఇది చాలా పవిత్రమైన మంత్రము. పేరుకి ఒక గాయత్రీ మంత్రమే అనుకుంటాము కానీ మొత్తం బ్రహ్మాండానికే బీజ మంత్రము లాంటిది ఇది. ప్రణవనాదముతో మొదలయి పూర్తి సృష్టి రహస్యాన్ని కొన్ని శబ్దములు, నామముల ద్వారా కీర్తిచే మంత్రము ఇది.  

సృష్టికర్త ఆ పరంధాముడు శ్రీమన్నారాయణ. ఆయనను శ్రీలక్ష్మీ సమేతముగా సూర్యనారాయణ లోని కేంద్ర బిందువు రూపములో ధ్యానిస్తూ ఈ మంత్ర పారాయణము చెయ్యాలి మనము. జపము 10 సార్లు చేయాలి అంటారు. నేను 11 సార్లు చేస్తున్నాను. మామూలుగా పూజ చేసుకునే ముందు ఈ గాయత్రీ జపము గావించి అప్పుడు పూజ చేసుకుంటున్నాను నేను. 

గాయత్రీ మంత్రము మరియు అర్థములు 


ఓం భూర్భువః  స్వః | 
ఓం తత్సవితుర్వరేణ్యం | 
భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ ||

ఓం = ఇది ప్రణవ నాదము, సమస్త సృష్టికి మూలాధారము. సృష్టి, స్థితి, లయలను సూచించు శక్తి యొక్క సంక్షిప్త రూపము. 

భూ: = భూ లోకము, భూ తత్త్వం, ప్రకృతి స్వరూపము, ప్రపంచము. 

భువః = భువర్లోకము, భూమికి స్వర్గానికి మధ్య లోకము.  భౌతికతకి, ఆధ్యాత్మతకి సంబంధము చేకూర్చే శక్తి. 

స్వః అంటే సువః = స్వర్గ లోకము, దివ్యలోకము, పరమత్వము. 

తత్ = అది, ఆ యొక్క, ఆ పరమాత్మ యొక్క రూపము.  

సవితు = సూర్యుని తేజస్సు, దివ్య రూపము. 

వరేణ్యం = ఉత్తమమైనది, పూజనీయమైనది. 

భర్గః  = పవిత్రమైనది, దివ్యజ్ఞానమయము. 

దేవస్య = ఆ దేవుని, ఆ పరమాత్మను.  

ధీమహి = ధ్యానించుదాము 

ధియహ్ = జ్ఞానములు, దివ్య జ్ఞానములు. 

యః = ఆయన, ఆ పరమాత్మ. 

నః = నాకు 

ప్రచోదయాత్ = ప్రేరేపించును, అనుగ్రహించు గాక. 


పై మంత్రము యొక్క సంపూర్ణ భావము;

ముల్లోకములకు తన దివ్య తేజస్సుతో ప్రకాశమును, వెలుగును ప్రసాదించు ఆ సూర్య దేవుని యొక్క ( ఇక్కడ మనము పరమాత్మ అని భావించుకోవాలి) దివ్య స్వరూపము ఉత్తమమైనది, పవిత్రమైనది, జ్ఞానవంతమైనది. ఆ పరమాత్మను మనము ధ్యానిస్తే ఆయన మనకు మంచి బుద్ధి, దివ్యజ్ఞానము ప్రసాదించి, మనలను ఉత్తమ మార్గము వైపు ప్రేరేపించుచు మనలను అనుగ్రహించును. 

మనము సూర్యుని వైపు ముఖముగా కూర్చుని కానీ నిలబడి కానీ ఈ గాయత్రీమంత్ర పారాయణము చేస్తూ సూర్యుని తేజస్సు లోపల కేంద్రబిందువు అయిన ఆ శ్రీమన్నారాయణ మూర్తిని ధ్యానించాలి.           
  


గాయత్రీమంత్ర జపము సంధ్యావందనము లోని ఒక ముఖ్యమైన అంశము. 

సంధ్యావందనము అంటే సూర్య నమస్కారము, ప్రాణాయామము, మరియు గాయత్రీ జపములతో కూడిన ఒక విస్తారమైన ప్రక్రియ. 

ఉపనయనము అయిన ప్రతీ పురుషుడు, ముఖ్యముగా బ్రాహ్మణులు ప్రతిరోజూ పాటించాల్సిన కార్యక్రమము ఇది. ఇందులో 11 విధులు (అంటే stages) ఉన్నాయి. 

ఈ సంధ్యావందనము ఏ విధముగా చెయ్యాలో విస్తారముగా తెలుసుకోవాలంటే ఈ లింకును క్లిక్ చేసి చదువుకోగలరు. ఇది ఇంగ్లీష్ భాషలో ఉన్నది. 

11, ఏప్రిల్ 2025, శుక్రవారం

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము - Lakshmi Ashtottara Shatanaama Stotram Lyrics With Meanings


శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము  అన్నది శివ పరమాత్మ పార్వతిదేవికి తెలియజేస్తున్నట్లుగా మన పురాణముల ప్రకారము తెలుస్తోంది. 

లక్ష్మీదేవిని కీర్తిస్తూ 108 నామాల స్తోత్రములతో పూజించిన వారికి అన్ని శుభాలు కలుగజేయడం కోసమని పార్వతీదేవి ఆ శివపరమాత్మ ద్వారా మనకు ఈ వరాన్ని ప్రసాదించింది.   

పార్వతీదేవి చాలా దయామయురాలు. ఆమె తన భక్తులకు ఎప్పుడు ఏ విధముగా సాయపడుతూ ఉందామా అని తపన పడుతూ ఉంటుంది. 

ఒకసారి భక్తులు అష్ట కష్టాలూ పడుతూ పరితపించి పోతుంటే ఆమె తట్టుకోలేక శివుని జేరి తన భక్తుల కష్టాలు తీరి, సుఖ సౌభాగ్యాలతో బతికి మోక్షము పొందటానికి ఏదైనా సులువైన మంత్రము చెప్పమని శివుని అడిగింది. 

కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా వెయ్యి నామాలు భక్తులు ఎలా చదవగలుగుతారు. కాస్త సులువైన మార్గం చెప్పమని కోరితే, అప్పుడు శివ పరమాత్మ రామతారక మంత్రాన్ని తెలియజేశాడు. 

"శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం ... " అంటూ మూడు సార్లు రామ నామాన్ని జపిస్తే చాలు సహస్రనామాలు చదివిన పుణ్యం దక్కి భక్తులు మోక్షం పొందుతారు అని శివుడు వరమిచ్చెను. 

అల్లాగే ఈ సారి మనమంతా సుఖ, సౌభాగ్యాలతో ఉండటం కోసమని లక్ష్మీదేవి కటాక్షము పొందటానికి "శ్రీ లక్ష్మీ శతనామ స్తోత్రము" తెలియజేయమని కోరుతుంది. అప్పుడు శివుడు ఈ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పార్వతీదేవికి ఫలశృతి తో సహా తెలియజేస్తాడు.    

లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము 


లక్ష్మీదేవి వందనం, ప్రపత్తి 

శ్రీ భగవన్నారాయణాభి  మతానురూప, స్వరూప రూప, గుణవిభవ, ఐశ్వర్య, శీలాది అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణ గణాం, పద్మ వనాలయాం, భగవతీమ్, శ్రియం దేవీమ్, నిత్యానుపాయినీమ్, నిరవద్యామ్, దేవదేవ దివ్య మహిషీమ్, అఖిల జగన్మాతరం, అస్మన్ మాతరం, అశరణ్య శరణ్యామ్, అనన్య శరణః, శరణ మహం ప్రపద్యే ||        

అర్థము:-

శ్రీమన్నారాయణ అభిరుచులకు సరితూగు విధముగా స్వరూపము, అందమైన రూపము, సకల గుణ సంపదలు, ఐశ్వర్యము, శీలము మొదలగు అనేకములైన, మిక్కిలి సంపన్నమైన అత్యధిక కళ్యాణ గుణములు కలిగి, పద్మములో నివాసముండు భగవతి శ్రీ లక్ష్మీదేవీ! నిత్యమూ సేవించతగిన తల్లి (లేదా నిత్యమూ మహావిష్ణువుకు సేవ చేయునది), ఎటువంటి దోషములు లేనిది, ఆ దేవదేవునికి పట్టపు రాణి, అఖిల జగములకు తల్లి, నాకు తల్లివి, శరణు కోరని వారికి కూడా శరణము ఇచ్చే దేవీ, నాకు వేరెవ్వరు దిక్కు కారు, నీవే నాకు దిక్కు. తల్లీ! నిన్నే శరణు వేడుకుంటున్నాను. 

ఉపోద్ఘాతము 

దేవి ఉవాచ (పార్వతీదేవి అంటోంది)

దేవదేవ మహాదేవ, త్రికాలఙ్ఞ, మహేశ్వర, కరుణాకర, దేవేశ, భక్తానుగ్రహ కారక ! 
అష్టోత్తర శతం లక్ష్మ్యా శ్రోతుమిచ్ఛామి తత్త్వతః || 

అర్థము:-

దేవుళ్ళకే దేవుడవు, మహాదేవుడవు, అయినటువంటి ఓ మహేశ్వరా! ఓ కరుణామయా, భక్తులకు అనుగ్రహము పొందటానికి కారకుడవైన ఓ దేవేశ్వరా! శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ కీర్తన తత్త్వార్థములతో సహా వినాలని ఉంది. 


ఈశ్వర ఉవాచ ( అప్పుడు ఈశ్వరుడు చెప్తున్నాడు)

దేవి! సాధు ! మహాభాగే! మహాభాగ్య ప్రదాయకం, సర్వైశ్వర్య కరమ్ పుణ్యమ్ , సర్వ పాప ప్రణాశనమ్ | సర్వ దారిద్య్ర శమనం, శ్రవణాత్ భుక్తి ముక్తిదమ్, రాజవశ్యకరం దివ్యమ్, గుహ్యాత్ 
గుహ్యతరం పరమ్ | దుర్లభం సర్వ దేవానాం, చతుహ్ షష్టి కళాస్పదమ్ ||
పద్మాదీనాం వరాంతానాం, నిధీనాం నిత్య దాయకమ్ | 
సమస్త దేవ సంసేవ్యం, అణిమాద్యష్ట సిద్ధిదమ్ || 
కిమత్ర బహునోక్తేన, దేవీ ప్రత్యక్ష దాయకమ్ | తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహిత మనాః శృణు ||
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మీస్తు దేవతా | క్లిమ్ బీజపద మిత్యుక్తమ్ శక్తిస్తు భువనేశ్వరీ || 
అంగన్యాస కరన్యాస స ఇత్యాదిహి ప్రకీర్తితః ||

అర్థము:-

దేవీ, చాలా మంచిది. నా మహాభాగ్యము (లేదా నీవెంతో మహాభాగ్యవంతురాలివి). 

మహాభాగ్యాన్ని ప్రసాదించేది, అన్ని ఐశ్వర్యములలో కెల్లా పుణ్యప్రదమైనది, సకల పాపాలను పోగొట్టేది, సమస్త దరిద్రాలను తొలగించేది, విన్నవారికి భుక్తిని, ముక్తిని ప్రసాదించేది, దివ్యమైన  రాజయోగము కలింగించేది, ఎంతగా ఆరా తీసినా అంతు చిక్కనిది, సకల దేవతలకు కూడ లభ్యమయ్యేది కానిది, 64 కళలను రూపొందించేది, అంతులేని సిరులు, వరములు, నిధులను ప్రసాదించేది, సమస్త దేవతల చేత సేవింపబడుతూ ఉంటూ అణిమ మొదలగు అష్ట సిద్ధులను ఒసగేది, కాస్తంత స్మరిస్తే చాలు వెంటనే ప్రత్యక్షమై కాపాడు ఆ తల్లిని నీ హృదయంలో ప్రేమతో నిలుపుకుని  ధ్యానపూర్వకంగా వినుము.
 
ఇప్పుడే నేను చెప్పబోయే ఈ అష్టోత్తర శతనామ స్తోత్రాలని క్లిమ్ హ్రిమ్ శ్రిమ్ మున్నగు బీజపదములతో కూడిన శక్తి రూపురాలైన ఆ భువనేశ్వరీదేవిని అంగన్యాసము, కరన్యాసములతో సహా కీర్తించబోతున్నాము సుమా !     

లక్ష్మీ స్తుతి 


వందే పద్మకరాం ప్రసన్న వదనాం, సౌభాగ్యదాం, భాగ్యదామ్ 
హస్తాభ్యాం అభయప్రదాం, మణి గణైః నానావిధైహ్ భూషితామ్ | 
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిః సేవితాం 
పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిః యుక్తామ్ సదా శక్తిభిః || 
సరసిజ నయనే, సరోజ హస్తే, ధవళతరాంశుక గంధమాల్యశోభే !
భగవతి, హరివల్లభే, మనోజ్ఞే ! త్రిభువన భూతికరి ! ప్రసీదమహ్యమ్ || 

అర్థము:-

చేతిలో పద్మాన్ని ధరించి, ప్రసన్న వదనము కలిగి, సౌభాగ్యము, భాగ్యములు అందిస్తూ, చేతితో అభయాన్ని ప్రసాదిస్తూ అనేక విధములైన మణులతో పొదగబడిన ఆభూషణములతో అలంకరింపబడిన దానివై, భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సేవింపబడుతూ, శంఖ చక్రములు పద్మము బంగారుకాసులతో నిండిన బిందెలు ధరించి, శక్తి స్వరూపిణి వైన నీకు నా వందనములు. 
ఓ కలువ రేకుల వంటి కన్నులదానా! పద్మములవంటి చేతులు కలదానా! తెల్లని మంచు బిందువులతో కూడిన సుగంధ పుష్ప మాలలతో అలంకరింప బడిన దానా! ఓ భగవతీదేవి, విష్ణువుకి ప్రియసఖీ! మా అందరి మనస్సులను ఎరిగినదానా ! ముల్లోకముల ప్రాణులకు పియ్రమైన తల్లీ ! నన్ను అన్నివేళలా కాపాడుమా !        

లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము


ఇందులో 14 శ్లోకముల ద్వారా మొత్తం 108 నామాల కీర్తన చేయబడినది. 
ముందుగా శ్లోకాలను అన్నింటినీ తెలియజేసి, అటు పిమ్మట ఒక్కొక్క శ్లోకం లోని నామార్థములను తెలియజేస్తాను.  

ఓమ్ 

ప్రకృతిం వికృతిం విద్యామ్ సర్వభూత హితప్రదామ్ | 
శ్రద్దాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్ || (1)

వాచం పద్మాలయాం పద్మామ్ శుచిం స్వాహాం స్వధాం సుధామ్ |
ధన్యాం హిరణ్మయీమ్ లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్ || (2)

అదితిం చ దితిం దీప్తామ్ వసుధామ్ వసుధారిణీమ్ | 
నమామి కమలాం కాంతామ్ క్షమాం క్షీరోద సంభవామ్ || (3)

అనుగ్రహప్రదాం, బుద్ధిం, అనఘాం హరివల్లభామ్ | 
అశోకామ్ అమృతాం దీప్తాం లోకశోక వినాశినీమ్ || (4)

నమామి ధర్మ నిలయాం కరుణాం లోకమాతరమ్ | 
పద్మ ప్రియాం పద్మ హస్తాం పద్మాక్ష్మీం పద్మ సుందరీమ్ || (5)

పద్మోద్భవామ్ పద్మ ముఖీమ్ పద్మనాభ ప్రియాం రమామ్ | 
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మ గంధినీమ్ || (6)

పుణ్య గంధామ్ సుప్రసన్నాం ప్రసాదాభిముఖీమ్ ప్రభామ్ | 
నమామి చంద్ర వదనాం చంద్రాం చంద్ర సహోదరీమ్ || (7)

చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరామ్ ఇందుశీతలామ్ | 
ఆహ్లాద జననీం పుష్టిం శివామ్ శివకరీం సతీమ్ || (8)

విమలాం విశ్వజననీం తుష్టిమ్ దారిద్య్ర నాశినీమ్ | 
ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్ల మాల్యామ్బరామ్ శ్రియమ్ || (9)

భాస్కరీం బిల్వ నిలయాం వరారోహాం యశస్వినీమ్ | 
వసుంధరాం ఉదారాంగామ్ హరిణీం హేమ మాలినీమ్ || (10)

ధన ధాన్య కరీం సిద్ధిమ్ స్త్రైణసౌమ్యాం శుభ ప్రదామ్ | 
నృపవేశ్మ గతానందాం వరలక్ష్మీమ్ వసు ప్రదామ్ || (11)

శుభామ్ హిరణ్య ప్రాకారామ్ సముద్రతనయాం జయామ్ | 
నమామి మంగళామ్ దేవీమ్ విష్ణు వక్షస్థల స్థితామ్ || (12)

విష్ణుపత్నీం ప్రసన్నాక్షీమ్ నారాయణ సమాశ్రితామ్ | 
దారిద్య్ర ధ్వంసినీమ్ దేవీం సర్వోపద్రవ వారిణీమ్ || (13) 

నవదుర్గామ్, మహాకాళీమ్, బ్రహ్మవిష్ణు శివాత్మికామ్ | 
త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీమ్ || (14)


అర్థములు:- 

మొదటి శ్లోకము: 
 లక్ష్మీదేవి సహజమైన ప్రకృతి స్వరూపిణి , (అనేక రంగుల రూపముల మార్పులతో  గోచరమగు) కల్పిత జగత్తు రూపిణి , విద్యారూపిణి, సర్వ ప్రాణుల మంచి కోరే దేవి, శ్రద్ధా స్వరూపిణి, సర్వవ్యాపిని, దేవతా దేవి, అందరి ఆత్మలందు నివసించు ఆ దేవికి వందనములు. 

రెండవ శ్లోకము:
తీయని పలుకుల (ప్రసాదించే) దేవి, పద్మములో నివసించునది, పద్మము వంటిది, శుచి (పవిత్ర) స్వరూపమైనది, ముల్లోకములకు శుభాలు కలిగించునది, అశుభములు తొలగించునది, అమృత రూపిణి, ధన్యురాలు, బంగారు వన్నెల అందచందములు కలిగినది, సిరిసంపదల తల్లి, సర్వదా బలపుష్టితో వర్ధిల్లునది, తేజస్సుతో ప్రకాశించునది. 

మూడవ శ్లోకము:
ఎటువంటి సరిహద్దులు లేనిది (సర్వత్రా ఉండునది), తన హద్దులలోనే ఉండే దేవి, సర్వత్రా వెలుగొందే జ్యోతి రూపిణి, భూ దేవి, భూమిని ధరించే దేవి, నమస్సులు ఓ తల్లీ, కమలము వంటిదానా, విష్ణుమూర్తి భాగస్వామిని, క్షమాగుణ స్వరూపిణీ, పాలకడలి నుండి పుట్టిన తల్లీ !

నాలుగవ శ్లోకము:
అందరినీ అనుగ్రహించునది, బుద్ధి స్వరూపిణి, దోషములు, మచ్చలు లేనిది, శ్రీహరి ప్రియసఖి, శోకములు లేనిది, అమృతమయి, అందరికీ దీపము వంటిది (వెలుగుల తల్లి), లోకముల లోని శోకములను నిర్మూలించునది. 

ఐదవ శ్లోకము:
ఓ ధర్మానికి ఉనికి పట్టువైన దేవీ ! నీకు నా నమస్సులు. 
కరుణామయి, లోకాలకు తల్లి, పద్మములంటే మక్కువ కలిగినది, పద్మాన్ని తన చేతిలో దాల్చినది, పద్మముల వంటి కన్నులు కలది, పద్మము వలె అందమైన దేవి.  

ఆరవ శ్లోకము:
పద్మమునుండి పుట్టిన దేవి, పద్మములాంటి ముఖారవిందము కలది, పద్మనాభుడైన విష్ణుమూర్తి ప్రియసఖి, రమాదేవి (విష్ణుమూర్తిని రమించునది), పద్మముల మాలలు ధరించినది, పద్మినీ దేవి (పద్మమువలె అందము, సుకుమారత్వము కలది), పద్మగంధములతో అలరించే లక్ష్మీదేవి. 

ఏడవ శ్లోకము:
పుణ్యములు వెదజల్లునది (ఆవిడ ఉన్నచోట అంతా పుణ్యమే పుణ్యము), ఇంపైన ప్రసన్నత నిచ్చు దేవి, ప్రసాదములు అంటే ఇంపైన వరములను ప్రసాదించు దేవి, జ్యోతి స్వరూపిణి. చంద్ర వదనము కల తల్లి, చంద్రుని వంటి చల్లని, వెన్నెలా దేవి, చంద్రునికి సోదరి (లక్ష్మీదేవి లాగే చంద్రుడు కూడ సముద్రము నుండి పుట్టాడు).  

ఎనిమిదవ శ్లోకము:
చతుర్భుజములు (నాలుగు చేతులు) కలది, చంద్ర రూపిణి, ఇందిర అంటే ప్రకాశము (తేజస్సు, దేదీప్యమాన అందచందములతో వెలుగొందే దేవి), ఇందు శీతల అంటే చల్లని వెలుగుల తల్లి, ఆహ్లాదము కలిగించునది, పుష్టి అంటే ఆరోగ్య ప్రదాయిని, శివమ్ అంటే బ్రహ్మానందము కలిగించునది, శివకరి అంటే మంచి ఆనందకరమైన హాయిని ప్రసాదించునది, సతి అంటే స్త్రీలలో అందరి కంటె ఉత్తమురాలు.

తొమ్మిదవ శ్లోకము:
విమల అంటే శుచి అయిన పవిత్రతా దేవి, సమస్త సృష్టి కి తల్లి, తుష్టి అంటే సంతృప్తి ప్రసాదించునది, దారిద్య్రము పోగొట్టు దేవి, ప్రీతికి ఒక పుష్కరిణి లాంటిది, శాంతి స్వరూపిణి, తెల్లని మాలలు, బట్టలు ధరించునది, ఆమె శ్రీని కలిగించు లక్ష్మీదేవి. 

పదవ శ్లోకము:
భాస్కరి అంటే తేజస్సు ప్రసాదించునది, బిల్వ వృక్షము క్రింద కానీ బిల్వ పత్రమందు కానీ నివసించునది, అపారమైన వరములను ఇచ్చే దేవి, యశస్సు కలిగించునది, వసుంధర అంటే భూమికి తల్లి, ఉదార హృదయము కలది, హరిణి అంటే మన హృదయాన్ని ఆకర్షించునది, బంగారు ఆభరణములు ధరించునది. 

పదునొకండవ శ్లోకము:
ధనధాన్యములను ఇచ్చునది, అష్ట సిద్ధులను ప్రసాదించునది, స్త్రీలపట్ల మెత్తని స్వభావము, దయ కలిగినది, శుభములను ప్రసాదించునది, భవ్య భవనములలో చరిస్తూ ఆనందముతో ఉండునది (నృప అంటే రాచరికం, వేశ్వము అంటే గూడు లేదా నివాస స్థలము), వరముల నొసగే తల్లి, (వసు)ఐశ్వర్యముల నొసగే దేవి.    

పన్నెండవ శ్లోకము:
శుభము కలిగించునది, బంగారు ప్రాకారములతో గూడిన నివాసము కలది, సముద్రుని పుత్రిక, జయముల నొసగునది, మంగళము కలిగించునది, దేవతలకే దేవేరి, విష్ణువు యొక్క వక్షస్థలములో నివసించునది.

పదమూడవ శ్లోకము:
విష్ణుపత్ని, ప్రసన్నమైన కనులు కలిగి ప్రసన్నత నిచ్చునది, నారాయణుని (విష్ణుమూర్తిని) ఆశ్రయించిన దేవి, దారిద్య్రం నశింపజేయు దేవి, సమస్త ఉపద్రవములు ఆపదలను తొలగించునది. 

పద్నాల్గవ శ్లోకము:
నవదుర్గ అంటే తొమ్మిది విధములైన దుర్గాదేవుల రూపములు గలది, మహంకాళి, బ్రహ్మ, విష్ణువు, మరియు శివుల ఆత్మలందు ఉండేది, త్రికాలముల జ్ఞానము క్షుణ్ణముగా ఎరిగినది, అటువంటి ఓ  భువనేశ్వరీదేవీ! నీకు నా నమస్సులు. 


ఇక్కడితో 108 నామముల లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాలు పూర్తి అయ్యాయి. దీని తరువాత రెండు స్తోత్రాలు ప్రతీ రోజూ చదువుకో దగినవి ఉన్నాయి. అవి చదివి, ఆ తరువాత ఫలశ్రుతి చదవాలి. 

రెండు లక్ష్మీ స్తోత్రములు 


లక్ష్మీమ్, క్షీరసముద్ర రాజ తనయాం, శ్రీరంగ ధామేశ్వరీం 
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురామ్ 
శ్రీమన్ మందకటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం 
త్వామ్ త్రైలోక్య కుటుంబినీమ్, సరసిజాం, వన్డే ముకుందప్రియామ్ || 

మాతర్నమామి, కమలే ! కమలాయతాక్షీ !
శ్రీవిష్ణు హృత్కమల వాసిని, విశ్వమాతా !
క్షీరోదజే ! కమల కోమల గర్భగౌరి !
లక్ష్మీ ! ప్రసీద సతతం, నమతాం శరణ్యే !

లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర ఫలశ్రుతి 


త్రికాలం యో జపేత్ విద్వాన్, షణ్మాసం, విజితేంద్రియ,
దారిద్య్ర ధ్వంసనం కృత్వా సర్వ మాప్నోత్య యత్నతః || 

అర్థము:

మూడు కాలాలు (అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము) ప్రతిరోజూ 6 నెలల పాటు శ్రద్దతోను, ఇంద్రియాలను కట్టడిలో ఉంచుకుని కనుక చదివితే దారిద్య్రము నశించి, ఏ కార్యము చేపట్టినా చక్కగా సాధించుకో గలుగుతారు. 


దేవీనామ సహస్రేషు పుణ్యం అష్టోత్తరం శతమ్ 
యేన శ్రియ మవాప్నోతి కోటి జన్మ దరిద్రతః || 
     
అర్థము:

దేవీ నామాలలో సహస్రనామాలన్నింటి కంటే ఈ 108 నామాలు పుణ్యప్రదమైనవి. వీటి ద్వారా కోటి జన్మల దరిద్రత కూడా తీరిపోయి ధనవంతులు అవుతారు. 


భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సర మాత్రకమ్ 
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలః || 

అర్థము:

భృగు వారము అంటే శుక్రవారము. ప్రతి శుక్రవారమూ ధీమాగా పట్టుదలగా మొత్తం ఏడాది అంతా నిష్టగా చదివితే అష్టైశ్వర్యములు కలుగుతాయి. ఈ భూమిలోనే కుబేరులు అవుతారు. 

ఎనిమిది రకముల ఐశ్వర్యములు: ధనము, సంతోషము, సౌభాగ్యము, ఆరోగ్యము, సంతానము, పారివారిక సుఖము, మిత్ర సుఖము, విద్య ఇవన్నీ కలుగుతాయి అన్నమాట. 


దారిద్య్ర మోచనం నామ స్తోత్రం అంబాపరం శతమ్ 
యేన శ్రియ మవాప్నోతి కోటి జన్మ దరిద్రతః || 

అర్థము:

లక్ష్మీమాత యొక్క ఈ శతనామములు దారిద్రత నుండి విమోచన పొందటానికి కనుక చదివితే కోటి జన్మల దరిద్రతా తీరిపోయి భాగ్యవంతులు అవుతారు. శ్రేయస్సును కూడ పొందుతారు. 


భుక్త్వాతు విపులాన్ భోగా నంతే సాయుజ్య మాప్నుయాత్ 
ప్రాతః కాలే పఠేత్ నిత్యం సర్వదుఃఖోప శాంతయే || 

అర్థము:

హాయిగా జీవించినంత కాలము భోగాలను అనుభవించి, అంత్య కాలములో మోక్షాన్ని పొందుతారు. ప్రతిదినము తెల్లవారు ఝామునే చదువుతూ ఉంటే అన్ని దుఃఖములు సమసిపోయి హాయిగా బతుకుతారు. 


పఠంస్తు చింతయేత్ దేవీమ్ సర్వాభరణ భూషితామ్ ||  

కాబట్టి మనము ఆ సర్వాభరణములతో అలంకరింపబడిన లక్ష్మీదేవిని స్మరిద్దాము, పఠనము చేస్తూ పూజించుకుందాము.